విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ లో మంగళవారం అర్ధరాత్రి నుంచి జరపతలపెట్టిన సమ్మెను కార్మిక సంఘాలు విరమించుకున్నాయి. వివిధ సమస్యలు పరిష్కారంతో పాటు వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈరోజు అర్దరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని 15 రోజుల క్రితమే ఆర్టీసీయాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి. మంగళవారం కార్మిక శాఖ మంత్రి అచ్చెనాయుడుతో దాదాపు 2 గంటలపాటు జరిపిన చర్చలు సఫలం అవటంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించుకున్నాయి. 25 శాతం ఫిట్ మెంట్ కు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి.
ఎపిఎస్ ఆర్టీ నష్టాల్లో ఉందని, డీజిల్ రేటు విపరీతంగాపెరగడం వలన నష్టాలు అధికమయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. దీంతో అర్టిసికి 750 కొట్ల నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. ఆర్టీసీకి పల్లెవెలుగు బస్సుల ద్వారానష్టాలు వస్తున్నాయని, అర్టీసీ స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం అనిఆయన తెలిపారు. ఆర్టీసి నష్టాలను ప్రభుత్వమే భరించాలని ప్రతిపాదన ఉంది, ముఖ్యమంత్రితో మాట్లాడి నష్టాలను పూరిస్తాం అని అచ్చెన్నాయుడు చెప్పారు.
ప్రభుత్వం 25 శాతం ఫిట్ మెంట్ ఇస్తామని ఒప్పుకుందని, 91 డిమాండ్లను ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్ తెలిపారు.పే స్కేలు అరియర్స్ బకాయిలు ,ఉగాది నాటికి మొదటి బోనస్ ఇస్తారని ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన దృష్ట్యా, చర్చలు సఫలమవ్వడంతో రేపటి సమ్మెను విరమిస్తున్నాం అని దామోదర్ వివరించారు.