Jamili Elections: దేశమంతా ఒకేసారి ఎన్నికల విషయమై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం
ఈ ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్ద మొత్తంలో డబ్చు ఖర్చు చేయాలి. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం పడతారు
- tony bekkal
- Published On : July 27, 2023 / 08:29 PM IST
Jamili Elections: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా రోజులుగా జమిలి ఎన్నికల గురించి (దేశంలోని అన్ని అసెంబ్లీలతో కలిపి ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు) మాట్లాడుతున్నారు. 2024లో జరిగే ఎన్నికలు అవేనంటూ చాలా మంది ఊదరగొట్టారు. అయితే అవన్నీ ఇప్పట్లో సాధ్యం కావని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. గత కొద్ది కాలంగా జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టమైన ప్రకటన వెల్లడించింది. జమిలి ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కష్టమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పేసింది.
Vinod Sharma: నరేంద్ర మోదీ మీద బీజేపీ నేతకే నమ్మకం లేదట.. హోర్డింగ్ పెట్టి మరీ రచ్చ
ఈ ఎన్నికలపై రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాతపూర్వక సమాధానమిచ్చారు. ‘‘ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అంత సులభం కాదు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ అదే సమయంలో అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు కూడా ఉన్నాయి. కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు దీనికి అవసరం. అంతకు ముందు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయం సాధించాలి. పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్స్ మిషన్స్ కావాల్సి ఉంటుంది. అందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి.
Manipur Violence: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. తుపాకులతో ఇరు వర్గాల ఘర్షణ
పైగా ఈ ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్ద మొత్తంలో డబ్చు ఖర్చు చేయాలి అంటే కష్టమే. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం పడతారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ విషయంపై కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన పూర్తైంది. కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు కూడా జరిపింది. తదుపరి రోడ్ మ్యాప్ రూపకల్పనకై ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉంది’’ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు.
