బెజవాడ వాసులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు : దుర్గగుడి ఫ్లైఓవర్‌పై ఏప్రిల్ నుంచి రాకపోకలు

  • Publish Date - February 23, 2020 / 02:33 AM IST

బెజవాడ వాసులు ట్రాఫిక్ కష్టాలు కొద్దిరోజుల్లో తీరనున్నాయి. విజయవాడ భవానీపురం, గొల్లపూడి నుంచి వన్ టౌన్ లోకి రావాలంటే నరక ప్రాయంగా ఉండే దుర్గ గుడి ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కనకదుర్గమ్మఫ్లై ఓవర్ నిర్మాణ పనులు శరవేగంతో పూర్తి అవుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఏప్రియల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహించి  ఆ తర్వాత అనధికారికంగా ఈ వంతెనపై రాకపోకలు సాగించేందుకు అనుమతివ్వాలని యోచిస్తున్నట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ చెప్పారు.
 
రూ.325 కోట్ల వ్యయంతో , 2.6 కిలోమీటర్ల మేర  సోమా ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని చేపట్టింది.  2015 డిసెంబర్‌ 28 నుంచి పనులు మొదలుపెట్టారు. వాస్తవానికి  రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తికావల్సి ఉన్నా పలు అవాంతరాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయి. గడిచిన ఆరేడు నెలల్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 46 స్పాన్లతో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే స్పాన్లు, వింగ్స్‌ పూర్తయ్యాయి. ప్రస్తుతం కనకదుర్గ అమ్మవారి గుడి కొండపైకి వెళ్లే ప్రవేశ ద్వారానికి ఎదురుగా జరుగుతున్న రెండు స్పాన్ల పనులు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద వై డక్ట్, రాజీవ్‌గాంధీ పార్క్‌ వైపు అప్రోచ్‌ రోడ్ల పనులు తుది దశలో ఉన్నాయి. ఈ పనులు కూడా నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు.. ఫ్‌లైఓవర్‌కు ఇప్పటికే అందమైన రంగులు అద్దారు. వంతెనపై విద్యుద్దీపాల ఏర్పాటు 75 శాతం పూర్తయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ రెండ్రోజుల క్రితం కాంట్రాక్టరు ప్రతినిధులు, సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కనకదుర్గ ఫ్‌లైఓవర్‌ పనులన్నీ వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

రాజీవ్‌గాంధీ పార్క్‌ నుంచి సగం వరకు ఫినిషింగ్‌ వర్క్‌ పూర్తయిందని,  భవానీపురం వైపు పనులు సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఈ వంతెన పనులను పర్యవేక్షిస్తున్న ఆర్‌ అండ్‌ బీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (క్వాలిటీ కంట్రోల్‌) జాన్‌మోషే  వివరించారు. చివరి దశలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన నిర్ణీత గడువులో పూర్తవడానికి ప్రయత్నిస్తున్నామని  అధికారులు తెలిపారు.