కౌన్‌ బనేగా తెలంగాణ సీఎస్‌..అజయ్ మిశ్రా, సోమేశ్ కుమార్ !

  • Publish Date - December 30, 2019 / 12:41 AM IST

తెలంగాణకు కొత్త సీఎస్‌ ఎవరు? ఈ ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెరదించబోతున్నారు. రిటైర్‌ కానున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు చేసిన సీఎం కేసీఆర్‌… సీనియర్‌ అధికారుల పేర్లను పరిశీలించి ఓ  నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త సీఎస్‌గా ఎవరు రాబోతున్నారన్న దానిని 2019, డిసెంబర్ 30వ తేదీ సోమవారం ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెండేళ్లపాటు ఎస్‌కే జోషి సేవలు అందించారు. ఈయన డిసెంబర్ 31వ తేదీకి రిటైర్‌ కానున్నారు. ఈయన స్థానంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్న కొందరి పేర్లపై దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికార్లలో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశం ఉంది. కేసీఆర్‌కి సన్నిహితంగా మెలిగే అధికారికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సీఎస్‌ రేసులో అజయ్‌ మిశ్రా, సోమేశ్‌ కుమార్‌ మధ్య ప్రధాన పోటీ ఉండగా… అజయ్‌ మిశ్రాకు మరో ఆరు నెలల సర్వీస్‌ మాత్రమే ఉంది. సోమేశ్‌కుమార్‌కు ఇంకా మూడు సంవత్సరాల సర్వీస్‌ ఉంది. కానీ… సోమేశ్‌కుమార్‌ కంటే అజయ్‌ మిశ్రా సీనియర్‌. అయితే.. ఆరు నెలల్లో రిటైరయ్యే అజయ్‌ మిశ్రా కంటే.. మూడేళ్ల సర్వీస్‌ మిగిలివున్న సోమేశ్‌కుమార్‌ వైపే కేసీఆర్‌ మొగ్గు చూపే అవకాశం ఉంది.

Read More : అంతా సిద్ధం : CM KCR కరీంనగర్ టూర్ షెడ్యూల్