విశాఖ : తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. 2019, ఫిబ్రవరి 14వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి విశాఖకు వెళ్లనున్నారు. శారదాపీఠం వార్షిక వేడుకల్లో
విశాఖ : తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. 2019, ఫిబ్రవరి 14వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి విశాఖకు వెళ్లనున్నారు. శారదాపీఠం వార్షిక వేడుకల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పీఠంలో వార్షిక ఉత్సవాలు జరగనున్నాయి. ముగింపు వేడులకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఫిబ్రవరి 14న శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాన కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి చీఫ్ గెస్ట్గా హాజరుకావాలని పీఠం నిర్వాహకులు కేసీఆర్ను ఆహ్వానించారు. ఇందుకు కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ ఏపీ టూర్ ఆసక్తికరంగా మారింది. ఇదివరకే ఆయన విశాఖకు వచ్చి వెళ్లారు. శారదాపీఠాన్ని దర్శించుకున్న తర్వాతే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు అదే (ఫిబ్రవరి 14) రోజున మంచి ముహూర్తం ఉండటంతో వైసీపీ చీఫ్ జగన్ సైతం అమరావతిలో నూతన గృహప్రవేశం చేయనున్నారు. దీనికి రావాలని కూడా కేసీఆర్కు ఆహ్వానం అందిందట. దీంతో కేసీఆర్ ఏపీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత 2018 డిసెంబర్లో విశాఖపట్నంలోని శారదాపీఠాన్ని కేసీఆర్ కుటుంబసమేతంగా సందర్శించారు. పీఠంలోని రాజశ్యామల మాతకు ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ నుంచే ఫెడరల్ ఫ్రంట్కు శ్రీకారం చుట్టారు. విశాఖ నుంచి ఒడిశా, కోల్కతా వెళ్లారు. సీఎంలు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీతో చర్చించారు. జాతీయస్థాయిలో యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ కూటమి ఏర్పాటు ప్రాధాన్యతను కేసీఆర్ వారికి వివరించారు.