ఆగస్ట్ 20 నుంచి భాద్రపద మాసం ప్రారంభవుతోంది..శ్రావణ మాసంలో మంగళగౌరీ నోము, వరలక్ష్మీ వ్రతాలతో ముత్తైదువులతో కళకళలాడిన ఇళ్లన్నీ నిశ్భబ్దంగా మారిపోతాయి. తెలుగు మాసాల్లో ఆరవది….శ్రావణ మాసం తర్వాత వచ్చేదే భాద్రపద మాసం. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వర్షఋతువులో వచ్చేమాసం.
ఈ మాసంలో రెండు విశేషాలు ఉన్నాయి. శుక్లపక్షంలో అంతా దేవతలకు, పూజలకు, నోములకు వ్రతాలకు ప్రాధాన్యమిచ్చేదిగా ఉంటే, కృష్ణ పక్ష కాలంలో పితృదేవతలకు నెలవైన మాసంగా చెపుతారు. విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయడానికి శిష్ట రక్షణ చేయడానికి దశావతారాలు ఎత్తాడనే విషయం అందరికీ తెలుసు. ఆ దశావతారాల్లోని వరాహ అవతారం, వామన అవతార పూజలు ఈ మాసంలోనే చేస్తారు. అందుకే ఈ మాసంలో దశావతార వ్రతం చేయాలంటారు.
చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసంగా వ్యవహరిస్తారు. ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయని పండితులు చెపుతున్నారు. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి.
హరితాళిక వ్రతం
కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. అలాగే సువర్ణగౌరీ, పదహారు కుడుముల తదియ మొదలైనవి చేస్తారు. ఈ హరితాళిక సువర్ణగౌరీ పదహారు కుడుముల తదియ మొదలైన నోములు ఈ మూడు కూడా చవితి మందురోజు అనగా వేరు వేరు ప్రాంతాల వారు వేరు వేరుగా జరుపుకొంటారు. అన్ని సారాంశం ఒకటే ఈ రోజు ఉపవాసం ఉండడం. ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడం ఈ రోజు ప్రత్యేకాంశం. ఈ వ్రతాన్ని ఆచరించి , ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి , అష్టైశ్వర్యాలతో తులతూగుతారనేది నమ్మకం.
వినాయకచవితి ఆగస్ట్ 22 శనివారం
భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు , ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కాని , మంగళవారం రోజు కాని రావడం మరింత విశేషాన్ని సంతరించుకొంటుంది. ఈ పూజను చాలా నియమ నిష్ఠలతో చేస్తారు. వినాయకుడిని 21 రకాల పత్రాలతో పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతారు. విద్యార్థులు పుస్తకాలను పెట్టి పూజిస్తారు. ప్రతి ఏటా ఏంతో వైభవంగా జరిగే గణేష్ ఉత్సవాలు ఈఏడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంత ఆర్భాటంగా జరిపేందుకు ప్రభుత్వం అనుమతించలేదు.
బుషి పంచమి
భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్యపురాణం లో చెప్పబడింది. ఈ వ్రతం లో ముఖ్యం గా ఆచరించవలసినది , బ్రహ్మాణుడికి అరటి పళ్ళు , నెయ్యి , పంచదార , దక్షిణ ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అంతే గాక ఆ భోజనం ధాన్యం , పాలు , పెరుగు , ఉప్పు , పంచాదారలతో తయారు చేయకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.
బుధ్ధ జయంతి
బౌద్ద జయంతి ని కూడా ఈ రోజునే జరుపుకొంటారు. బుద్దుని భోధనలు మానవుని ధర్మబద్దమైన , పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేసాయి. ప్రపంచం లోని ధర్మమతస్తాపనకు బుద్దుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు.
భాద్రపద శుద్ద షష్ఠి /సూర్య షష్ఠి , సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం , ఈరోజున సూర్యుడిని ఆవుపాలు , పెరుగు , నెయ్యి , గోమయం , గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రం లో చెప్పబడింది. షష్ఠి తో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.
కేదార వ్రతం
భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దంగా ఆచరిస్తుంటారు. భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం, దేవ , ఋషి , పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు.
భాద్రపద శుద్ద ఏకాదశి , దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాల సముద్రం లో శేషతల్పం పై శయనించిన శ్రీమహావిష్ణువు, ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు , అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగి పోతాయి. ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహా విష్ణువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతి గా చెప్పబడింది. ఈ రోజున వామనుడ్ని ఆరాధిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు.
శుక్లపక్షంలో వచ్చే అష్టమి శ్రీకృష్ణుని రాధను పూజించాలి. దీనినే రాధాష్టమి అంటారు. దీనివల్ల ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహం చేసుకున్నవారికి వైవాహిక జీవన సౌఖ్యం కూడా లభిస్తుంది. వారిద్దరి మధ్య అనురాగం పెరుగుతుంది.
ఏకాదశి…. దీనిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు అనగా ఆషాఢ ఏకాదశినాడు శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఈ రోజున వేరే వైపుకు తిరుగుతాడు అనగా పరివర్తనం చెందుతాడు అని అర్థం. అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కరువు కాటకాలు రావని ఒకవేళ వచ్చినా వాటినుంచి ఎలా బయట పడాలో తెలుస్తుందని ప్రతీతి.
ద్వాదశి : వామన జయంతి. దశావతారాల్లో ఒక అవతారం. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించిన అవతారం. ఈ రోజున వామనపూజ చేసి నైవేద్యం పెట్టి పెరుగును దానం చేయాలని చెపుతారు.
అనంత పద్మనాభ వ్రతం
భాద్రపద మాసం లో శుద్ద చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్పసాయిగా నాభికమలం తో శ్రీమహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువు ని పూజించి , వ్రతమాచరిస్తే దారిద్ర బాధలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకొంటారు , భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
మహాలయ పక్షం
భాద్రపద పూర్ణిమ తో మహాలయపక్షం ఆరంభమవుతుంది, అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు , పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి. శ్రాద్దాన్ని యధాశక్తి గా ఈ దినాలలో చేయాలి.
ఉండ్రాళ్ళతద్ది
భాద్రపద బహుళ తదియ ని ఉండ్రాళ్ళ తద్దేగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకొనే పండుగ , ముఖ్యంగా కన్నె పిల్లలు గౌరీ దేవి ని పూజించి , ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకు అయిదవతనం వృద్ది చెందుతుంది.
భాద్రపద కృష్ణ ఏకాదశి /అజ ఏకాదశి దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పూర్వం హరిశ్చంద్రుడు ఆచరించాడని చెపుతారు. హరిశ్చంద్రుడు అన్నీ పోగొట్టుకుని కాటికాపరిగా ఉంటూ ఈ ఏకాదశిరోజున వ్రతం చేయడం వలన తిరిగి సుఖ సంపదలు, అష్టైశ్వర్యాలు, రాజ్యభోగాలు పొందాడని చెపుతారు.
ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యరోజుల్లో దానధర్మాలు ఎక్కువగా చేయాలి. భాద్రపద కృష్ణఅమావాస్య /మహాలయమావాస్య , ఈ రోజున పితృ తర్పణాలు , దానధర్మాలు చేయడం ఆచారం.
ఇవీ భాద్రపదమాసంలోని కొన్ని ప్రత్యేకతలు. ఇంత విశేషమైన మాసం కాబట్టే కొందరు అసలు కలియుగమే భాద్రపదంలో మొదలైందని నమ్ముతారు. భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు. ఆ మాసంలో ప్రజలంతా ‘భద్రంగా’ ఉండాలన్న ఆలోచనతో ఆ పేరు పెట్టినట్లు తోస్తుంది.