Yadadri Temple : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. నేటి నుంచి (మార్చి 28 సోమవారం) స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భాగ్యం కలగనుంది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ జరుగనుంది. యాగ జలాలతో పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి మూలవరుల దర్శనాలకు శుభతరుణం ఆసన్నమైంది. సోమవారం ఆలయ ఉద్ఘాటన ఘనంగా జరగనుంది. ఉదయం 9 గంటలకు మహాపర్వం మొదలు కానుంది. ఆ తర్వాత ఆలయంలో దైవ దర్శనాలకు తెరతీయనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, 9:30 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహా కుంభసంప్రోక్షణ, వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. మహా సంప్రోక్షణ అనంతరం బాలాలయం నుంచి ప్రధానాలయంలోకి స్వామి వారిని ఆవాహన చేస్తారు. మధ్యాహ్నం తర్వాత స్వయంభువుల దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.
బంగారు వర్ణ విద్యుత్తు దీపాల వెలుగులో శ్రీస్వామి సన్నిధి వెలుగులతో జిగేలుమంటోంది. దివ్య విమానంపై వివిధ రంగులతో కూడిన పతాకాలు ఆవిష్కరించారు. ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపైనా స్వర్ణకలశాలకు మహాకుంభ సంప్రోక్షణను ఒకేసారి 92 మంది రుత్వికులు నిర్వహిస్తారు.
సప్తాహ్నిక దీక్షతో వారం నుంచి బాలాలయంలో కొనసాగించిన పంచకుండాత్మక మహాయాగంలో పూజించిన నదీజలాలను మహాకుంభంలోకి చేర్చి ఆ పుణ్య జలాలతోపాటు శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర చేపడతారు. పునర్ నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు.
విమానం, గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాన్ని కొనసాగిస్తారు. అనంతరం ప్రధానాలయంలోకి వేద, మంత్ర పఠనాల మధ్య ప్రవేశించి ఉపాలయాలలో ప్రతిష్ఠామూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహిస్తారు. ప్రథమారాధనలు చేపడతారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వం అనంతరం గర్భాలయంలోని స్వయంభువుల దర్శనాలకు అనుమతి ఇస్తారు. మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పూజలు, ఉత్సవాల ఏర్పాట్లు, ప్రొటోకాల్ ఏర్పాట్లు, గెస్ట్హౌస్, గదుల కేటాయింపు, నీరు, భోజన వసతి, బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటి వాటిపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని యదాద్రి ఈవో గీతారెడ్డి తెలిపారు.
యాదాద్రి మహాసంప్రోక్షణ సందర్భంగా భక్తులు. వీఐపీల తాకిడి పెరగనుండటంతో సీసీ కెమెరాలను అమర్చామన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. యాదాద్రిలో పరిస్థితిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిశీలిస్తామని చెప్పారు.
Also Read : Yadadri Temple Samprokshana : రేపే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున: ప్రారంభం
మరోవైపు గోవింద నామస్మరణతో యాదాద్రి మార్మోగుతుంది. మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా ఏడో రోజు పంచకుండాత్మక యాగం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం శాంతిపాఠం, చతుస్థానార్చన, మూల మంత్ర హవనాలు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, మూలమంత్ర హావనములు, చతు:స్థానార్చనలు, షోడశ కళాన్యాస హోమములు, పంచశయ్యధివాసం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించారు.