Aakash Chopra: దేశవాళీ రికార్డులు పనికిరావా..! సర్ఫరాజ్ ఏం చేయాలి..? బీసీసీఐని ప్రశ్నించిన భారత మాజీ ఓపెనర్
విండీస్కు వెళ్లే టెస్టు జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవటంతో పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ టార్గెట్గా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు.
- Harishth Thanniru
- Published On : June 24, 2023 / 11:09 AM IST
Sarfaraz Khan
Sarfaraz Khan: టీమిండియా (Team india) జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్ (West Indies Tour) కు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడుతుంది. అయితే, వెస్టిండీస్ పర్యటనకోసం టీమిండియా టెస్ట్, వన్డే జట్టును శుక్రవారం బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ముఖ్యంగా టెస్టు జట్టు ఎంపికలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ((Ajinkya Rahane) వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. టెస్టుల స్పెషలిస్టుగా చెప్పుకొనే ఛతేశ్వర్ పుజారా ను పక్కన పెట్టారు. యువ ఆటగాళ్లు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లు కూడా టెస్టు జట్టులో ఎంపికయ్యారు.
Srikar Bharat : వెస్టిండీస్ టూర్కు సిద్ధంగా ఉన్నా.. బాధ్యత మరింత పెరిగింది
విండీస్కు వెళ్లే టెస్టు జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) పేరు లేకపోవటంతో పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ టార్గెట్గా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు. సర్ఫరాజ్ ఏం పాపం చేశాడంటూ ప్రశ్నించారు. గతకొన్ని సంవత్సరాలుగా రంజీ ట్రోఫీలో స్థిరమైన ప్రదర్శనలు ఉన్నప్పటికీ సర్ఫరాజ్ను విండీస్ టూర్కు ఎంపిక చేయకపోవటం పట్ల ఆకాశ్ చోప్రా బీసీసీఐపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలలో అతని సంఖ్యలను పరిశీలిస్తే మిగిలిన వారికంటే మెరుగ్గా ప్రదర్శన ఇచ్చాడు. అయినా సెలెక్ట్ కాకపోతే.. ఏం మెసేజ్ పంపుతుంది? అని చోప్రా ప్రశ్నించారు.
సర్ఫరాజ్ను విండీస్ టూర్కు ఎంపిక చేయకపోవటం వెనుక మీకు, నాకు తెలియని మరేదైనా కారణం ఉంటే దానిని పబ్లిక్ గా చెప్పండి. సర్ఫరాజ్లో పలానా విషయం నచ్చని కారణంగా అతన్ని విండీస్ జట్టుకు ఎంపిక చేయలేదు అని వివరణ ఇవ్వండి. కానీ అలాంటిదేదో మనకు తెలియదు, ఆ విషయం ఎవరైనా సర్ఫరాజ్కు చెప్పారో లేదో నాకు తెలియదు అని చోప్రా అన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగులకు విలువ లేదా? ఐపీఎల్లో ఆటతీరునే మీరు పరిగణలోకి తీసుకుంటారా? అంటూ ఆకాశ్ చోప్రా ప్రశ్నించారు. ఇదిలాఉంటే సర్ఫరాజ్ ఖాన్ను విండీస్ టూర్కు వెళ్లే భారత జట్టులో ఎంపిక చేయకపోవటం పట్ల క్రికెట్ అభిమానుల నుంచి పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలి కాలంలో టీమిండియా జట్టు ఎంపిక సమయంలో సర్ఫరాజ్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దేశవాళీలో పరుగులు సాధిస్తున్నా సర్ఫరాజ్ ను సెలెక్టర్లు ఎందుకు పట్టించుకోవటం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సర్ఫరాజ్ ఇప్పటి వరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 79 సగటుతో 3,505 పరుగులు చేశాడు. ఇందులో డబుల్, ట్రిపుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2019 – 2020, 2020 – 2021 సీజన్లలో సర్ఫరాజ్ 900కుపైగా పరుగులు సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 600కుపైగా పరుగులు చేశాడు. ఈ మూడు సీజన్ లలో సర్ఫరాజ్ సగటు ఏకంగా 100కుపైగా ఉండటం గమనార్హం. అయితే, దేశావాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఇటీవల జరిగిన ఐపీఎల్ లో పరుగులు రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యాడు.
