CM Jagan Congratulated Meenakshi : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మీనాక్షిని ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా చదరంగంలో మరింతగా రాణించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మీనాక్షికి అవసరమైన విధంగా పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మీనాక్షికి విశాఖపట్నంలో వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలం, ఆమె చెస్లో కెరీర్ను కొనసాగించేందుకు కార్పస్గా రూ. 1 కోటి నిధిని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మీనాక్షి రికార్డులు నెలకొల్పారు. ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2023 పురస్కారాన్ని మీనాక్షి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.
AP CM YS Jagan: విశాఖ రాజధానిపై గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు ..
వరల్డ్ నెంబర్ 1 అండర్ 12 గర్ల్స్ చెస్ 2023 (ఫిడే ర్యాంకింగ్స్), వరల్డ్ నెంబర్ 1 అండర్ 11 గర్ల్స్ చెస్ 2022, వరల్డ్ నెంబర్ 2 అండర్ 10 గర్ల్స్ చెస్ డిసెంబర్ 2021, ఉమెన్ ఫిడే మాస్టర్ 2022, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ 2021 టైటిల్స్ గెలుచుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో పలు పతకాలు సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ తో మీనాక్షి, తల్లిదండ్రులు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం జగన్ ను మీనాక్షి తల్లిదండ్రులు డాక్టర్ అపర్ణ, మధు కలిశారు. మీనాక్షి ప్రతిభను సీఎం జగన్ ప్రసంసించారు. వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న క్రీడాకారులకు తమ ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని హామీ ఇచ్చారు.