Sricharani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. రూ. 2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం, ఇంకా..
భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి (Sricharani) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
- Thota Vamshi Kumar
- Published On : November 7, 2025 / 01:01 PM IST
AP Government cash award to sricharani
Sricharani : భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత మహిళా క్రికెట్ జట్టు తొలి సారి వన్డే ప్రపంచకప్ ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆమెకు ఏపీ ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. అంతేకాదండోయ్.. గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది.
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి..
సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి శ్రీచరణి కలిసింది. వీరికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.
వన్డే ప్రపంచకప్ గెలిచినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు శ్రీచరణిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలుచుకున్న మధుర క్షణాలను వారితో శ్రీచరణి పంచుకుంది. మహిళా క్రీడాకారులకు ఆమె ఆదర్శంగా నిలిచిందని సీఎం ప్రశంసించారు.
Kane Williamson : కేన్ మామ ఏంది ఇది.. మొన్న టీ20లకు రిటైర్మెంట్.. ఇప్పుడేమో ఇలా..
ఘన స్వాగతం..
అంతకముందు శ్రీచరణికి గన్నవరం విమానాశ్రమంలో ఘన స్వాగతం లభించింది. మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ రవినాయుడు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
14 వికెట్లు..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో 21 ఏళ్ల శ్రీ చరణి మంచి ప్రదర్శన చేసింది. 9 మ్యాచ్ల్లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 4.96 ఎకానమీతో 14 వికెట్లు తీసింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్లో భారత విజయానికి బాటలు వేసింది. ఈ టోర్నీలో టీమ్ఇండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
