Team India : టీమ్ఇండియా 36 కే ఆలౌట్.. స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేసిన రవిశాస్త్రి.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
వరుసగా రెండు సార్లు భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
- Thota Vamshi Kumar
- Published On : September 16, 2024 / 03:18 PM IST
Ashwin reveals Ravi Shastri unexpected karoake night right after 36 all out vs Australia
Ravi Shastri : వరుసగా రెండు సార్లు భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత సారి (2020-21 పర్యటనలో) నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది. అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ భారత్కు వచ్చేశాడు. అయినప్పటికి అజింక్యా రహానే నేతృత్వంలో టీమ్ఇండియా గొప్ప పోరాట పటిమను ప్రదర్శిస్తూ సిరీస్ను సొంతం చేసుకుంది.
బంగ్లాదేశ్తో పర్యటన ముందు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. 36 పరుగులకే కుప్పకూలిపోవడంతో ఆటగాళ్లు తీవ్ర నిరాశలో కూరుకుపోయారన్నాడు. ప్లేయర్లలో ఉత్సాహం నింపేందుకు అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక పాత్ర పోషించినట్లుగా చెప్పుకొచ్చాడు. అడిలైడ్లో ఓడిపోయిన రోజు రాత్రి రవిశాస్త్రి డిన్నర్ను ఏర్పాటు చేశాడని తెలిపాడు.
Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు
డిన్నర్ చేస్తుండగా రవిభాయ్ పాటలు పాడడం ప్రారంభించాడు. ఇక ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరిగా ఆయన్ను అనుసరించినట్లుగా అశ్విన్ చెప్పాడు. దీంతో ఓటమి బాధ నుంచి కాస్త తేరుకున్నట్లుగా వివరించాడు. విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇక మిగిలిన టెస్టు సిరీస్ను ఎలా ఆడాలన్న దానిపై చర్చించినట్లుగా తెలిపాడు.
‘నిజం చెప్పాలంటే సిరీస్ గెలవడం గురించి ఆలోచించలేదు. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాము. ఆ తరువాత ఒక్కొ మ్యాచ్ పై దృష్టి సారిస్తూ వెళ్లాం.’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సిరీస్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. 2018-19, 2020-21 పర్యటనల్లో సిరీస్ లు సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది చివరల్లో భారత జట్టు మరోసారి ఆస్ట్రేలియా పర్యటించనుంది. ఈ సారి 5 టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లోనూ భారత్ గెలిచి హ్యాట్రిక్ సాధించిన జట్టుగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
