Babar Azam : ఐపీఎల్లో కోహ్లి బిజీ.. విరాట్ రికార్డుల పని పడుతున్న బాబర్ ఆజాం
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : May 15, 2024 / 12:35 PM IST
Babar Azam surpasses Virat Kohli on list of most 50plus scores in T20I
Babar Azam – Virat Kohli : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు. ఇదే అదునుగా కోహ్లి రికార్డులను బ్రేక్ చేసే పనిలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం ఉన్నాడు. తాజాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 50 ఫ్లస్ స్కోరు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజాం నిలిచాడు.
మంగళవారం ఐర్లాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో బాబర్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. బాబర్ ఈ మ్యాచ్లో 42 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో బాబర్ 39 సార్లు 50 ఫ్లస్ స్కోర్లు సాధించగా, కోహ్లి 38 సార్లు ఈ ఘనతను అందుకున్నాడు.
117 మ్యాచుల్లో బాబర్ ఆజామ్ 3 శతకాలు, 36 అర్ధశతకాలు బాదగా, కోహ్లి 117 మ్యాచుల్లో ఓ శతకం, 37 అర్ధశతకాలు నమోదు చేశాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, డేవిడ్ వార్నర్లు ఉన్నారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 50 ఫ్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు..
బాబర్ ఆజాం (పాకిస్తాన్) – 39 సార్లు
విరాట్ కోహ్లి (భారత్) – 38 సార్లు
రోహిత్ శర్మ (భారత్) – 34 సార్లు
మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) – 29
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 27
మరో 82 పరుగులు చేస్తే..
బాబర్ ఆజాం టీ20ల్లో మరో 82 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు కోహ్లి పేరిట ఉంది. కోహ్లి 117 మ్యాచుల్లో 4037 పరుగులు చేశాడు. బాబర్ 117 మ్యాచుల్లో 3955 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో టీమ్ఇండియా కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 151 మ్యాచుల్లో 3974 పరుగులు చేశాడు.
కాగా.. ఐర్లాండ్తో టీ20 సిరీస్ ముగిసింది. మే 22 నుంచి ఇంగ్లాండ్తో పాకిస్తాన్ నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. బాబర్ ఉన్న ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే ఇంగ్లాండ్తో సిరీస్లో 82 పరుగులు చేసి కోహ్లి రికార్డును బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాదు. అయితే.. విరాట్ కోహ్లి ఐపీఎల్తో బిజీగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్లోనే కోహ్లి టీమ్ఇండియా తరుపున ఆడనున్నాడు.
