MS Dhoni : ధోని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ! అదే జరిగితే కూల్ కెప్టెన్కు రిటైర్మెంట్ తప్ప మరో దారిలేదు!
బీసీసీఐ తీసుకోబోతున్న ఓ నిర్ణయం వల్ల ధోని (MS Dhoni) కెరీర్కు ఎండ్ కార్డు పడబోతుందని అంటున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 31, 2026 / 12:59 PM IST
Bad news for MS Dhoni fans ahead of IPL 2027 BCCI reconsider impact player rule
MS Dhoni : ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై మరోసారి చర్చమొదలైంది. ఐపీఎల్ 2027 సీజన్లో ఈ నిబంధనను కొనసాగించాలా ? వద్దా? అనే దానిపై లీగ్లోని పది ఫ్రాంఛైజీల అభిప్రాయాలను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనపై ఫ్రాంఛైజీలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు నేడు (ఆగస్టు 31) చివరి తేదీ అని సమాచారం.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధననే కాకుండా ఐపీఎల్కు సంబంధించిన పలు అంశాలపై ఫ్రాంఛైజీల అభిప్రాయాలను బీసీసీఐ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ప్లేయర్లు, మ్యాచ్ అధికారుల ప్రాంతం విషయంలో ఖచ్చితమైన నిబంధనలను పాటించడం, కమ్యూనికేషన్కు సంబంధించి ఫోన్స్ వాడకం నిషేదం కొనసాగించాలా? వద్దా? వంటి విషయాలపై బీసీసీఐ అభిప్రాయాలను కోరింది.
వాస్తవం చెప్పాలంటే ఐపీఎల్ 2027 సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంచాలని గతంలో బీసీసీఐ భావించింది. అయితే.. పలు జట్ల కెప్టెన్ల నుంచే కాకుండా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఆల్రౌండర్లకు ప్రాధాన్యత తగ్గిపోతుందని, 12 మందితో ఆడినట్లు అవుతుందని కామెంట్లు చేశారు. దీంతో దీనిపై సమీక్ష చేస్తామని బీసీసీఐ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఫ్రాంఛైజీల అభిప్రాయాలను కోరింది. సెప్టెంబర్లో జరగబోయే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ధోనికి కష్టమే?
ఐపీఎల్ 2027 సీజన్ నాటికి మహేంద్ర సింగ్ ధోనికి 45 ఏళ్లు నిండుతాయి. గత కొన్నేళ్లుగా ధోని గాయాలతో పోరాడుతున్నాడు. గత సీజన్లో గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అంతకముందు సీజన్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా పలు మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2027 సీజన్లోనూ అతడు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఎత్తి వేస్తే ధోని మ్యాచ్లు ఆడడం కష్టమే. మరికొన్ని రోజుల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై స్పష్టత రానుంది.
