T20 World Cup 2024 – Tanzim Hasan Sakib : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బంగ్లాదేశ్ యువ పేసర్ తంజిమ్ హసన్ సాకిబ్పై చర్యలు తీసుకుంది. నేపాల్తో జరిగిన మ్యాచ్లో తంజిమ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. నేపాల్ కెప్టెన్ అయిన రోహిత్ పౌడెల్తో గొడవకు దిగాడు. దీంతో తంజిమ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. అంతేకాదు.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ను చేర్చడంతో పాటు మందలించారు. కాగా.. గత 24 నెలల్లో తంజిమ్ ఖాతాలో ఇదే తొలి డీమెరిట్.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఓ ప్లేయర్కి రెండేళ్ల కాలంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారతాయి. రెండు సస్పెప్షన్ పాయింట్లకు ఓ టెస్టు మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20 మ్యాచుల నిషేదాన్ని ఎదుర్కొంటాడు.
కింగ్స్ టౌన్ వేదికగా సోమవారం బంగ్లాదేశ్, నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవర్ ముగిసిన అనంతరం నేపాల్ కెప్టెన్ రోహిత్ దగ్గరకు వెళ్లి తంజిమ్ అతడికి ఢీ కొట్టాడు. అంతేకాకుండా అతడిని కవ్వించే ప్రయత్నం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య మాటాల యుద్ధం మొదలైంది. అంపైర్లతో పాటు ఫీల్డర్లు వచ్చి వారిద్దరికి సర్దిచెప్పారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ అల్ హసన్ (17) టాప్ స్కోరర్గా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో సోంపాల్, సందీప్ లమిచానె, రోహిత్ పాడెల్, దీపేంద్ర సింగ్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో తంజిమ్ నాలుగు వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. తన కోటా నాలుగు ఓవర్లలో రెండు ఓవర్లను మెయిడిన్ గా వేశాడు. మొత్తం 24 బంతులను అతడు వేయగా ఏకంగా 21 బంతులకు పరుగులు ఏమి రాకపోవడం విశేషం.
Rohit Sharma : 5 రోజుల వ్యవధిలో 3 మ్యాచులు.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..