Wrestlers Protest – Brij Bhushan: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని అయోధ్యలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బల ప్రదర్శన వాయిదా పడింది. తనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న వేళ ఆయన బల ప్రదర్శన చేయాలని భావించారు. అయితే, అయోధ్యలో సోమవారం నిర్వహించాలనుకున్న తన ర్యాలీని తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు బ్రిజ్ భూషణ్ ఇవాళ ప్రకటించారు.
మరోవైపు, ఇదే విషయంపై అయోధ్య అధికారులు మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్ ర్యాలీకి అనుమతి తీసుకోలేదని చెప్పారు. బ్రిజ్ భూషణ్ పై సస్పెన్షన్ వేటు వేయాలని బీజేపీపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ సమయంలో ఆయన బల ప్రదర్శనకు దిగుతానని చెప్పడంతో ఈ అంశం కీలకంగా మారింది.
కాగా, బ్రిజ్ భూషణ్ మొత్తం ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. గోండ్రా, కైసరగంజ్, బలరాంపూర్ నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. అయోధ్యలో ఆయనకు తిరుగులేని పాప్యులారిటీ ఉంది. బ్రిజ్ భూషణ్ నివాసం గోండా జిల్లాలో ఉంటుంది.
బ్రిజ్ భూషణ్ యువకుడిగా ఉన్న సమయంలో రెజ్లర్ కూడా. ఆయన 1980లో విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండేవారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయోధ్యలో రామ మందిర ఉద్యమం జరుగుతున్నప్పుడు బ్రిజ్ భూషణ్ కు హిందుత్వ ఇమేజ్ వచ్చింది.