Swati Maliwal: రెజ్లర్లను వదిలిపెట్టండి.. బీజేపీ ఎంపీని అరెస్టు చేయండి: స్వాతి మాలివాల్
లైంగిక వేధింపులకు గురైనవారిలో మైనర్ బాలిక ఉన్నప్పటికీ పోలీసులు ఇప్పటికీ బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకపోవడం ఏంటని ఆమె నిలదీశారు.
- T Venkateshwarlu
- Published On : May 28, 2023 / 07:39 PM IST
Swati Maliwal
Swati Maliwal – Wrestlers: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)ను అరెస్టు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ అన్నారు. అలాగే, అరెస్టు చేసిన రెజ్లర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఢిల్లీ (Delhi) పోలీస్ కమిషనర్ కు ఆమె లేఖ రాశారు. లైంగిక వేధింపులకు గురైనవారిలో మైనర్ బాలిక ఉన్నప్పటికీ పోలీసులు ఇప్పటికీ బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకపోవడం ఏంటని ఆమె నిలదీశారు. భారత టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్ని వారాలుగా ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, ఇతర ట్రైనర్ల నుంచి రెజ్లర్లకు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై వారు నిరసన తెలుపుతున్నారు. ఇవాళ నూతన పార్లమెంట్ కు మార్చ్ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి తీసుకెళ్లారు. వారిని ఎక్కడికీ తీసుకెళ్లారో కూడా తెలియదు.
అరెస్టయిన రెజ్లర్లలో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, విజయేందర్ కూడా ఉన్నారు. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకపోవడంతో విసుగెత్తిపోయిన రెజ్లర్లు తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఏడుగురు మహిళా రెజ్లర్లు కొన్ని వారాల క్రితం సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్రాంత పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేసే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి తాము కదలబోమని రెజ్లర్లు చెప్పారు.
స్వాతి రాసిన లేఖ..
Swati Maliwal Letter
Wrestlers detained: రెజ్లర్ల అరెస్టుపై వెల్లువెత్తిన వ్యతిరేకత.. నెట్టింట్లో విమర్శల వెల్లువ
