Dinesh Karthik : ధోని పై అక్కసుతోనే దినేశ్ కార్తీక్ ఇలా చేశాడా..?
ఇటీవలే ఐపీఎల్కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కామెంటేటర్గా మరింత బిజీ అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Published On : August 16, 2024 / 09:19 AM IST
Dinesh Karthik picks all time India playing XI across formats
Dinesh Karthik – MS Dhoni : ఇటీవలే ఐపీఎల్కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కామెంటేటర్గా మరింత బిజీ అయ్యాడు. భారత దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీమ్ఇండియా ఆటగాళ్ల నుంచి తన ఆల్టైమ్ ఎలెవన్ను ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతన్న వారిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాకు చోటు ఇచ్చాడు.
ఓపెనర్లుగా విధ్వంసకర వీరులు..
అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థులకు ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చి విధ్వంసకర వీరుడుగా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్తో పాటు వన్డేల్లో మూడు ద్విశతకాలు బాదిన రోహిత్ శర్మను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఇక వన్డౌన్లో మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ను తీసుకున్నాడు. కెరీర్లో వంద సెంచరీలు చేసిన సచిన్ను నాలుగో స్థానానికి ఎంచుకున్నాడు.
ఇక పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఐదో స్థానంలో ఛాన్స్ ఇచ్చాడు. ఆల్రౌండర్ల జాబితాలో యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాలకు తీసుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లేలను ఎంపిక చేశాడు. పేసర్లుగా జహీర్ఖాన్తో పాటు జస్ప్రీత్ బుమ్రాను తీసుకున్నాడు. ఇక స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ను 12వ ఆటగాడిగా తీసుకున్నాడు.
ధోనికి నో ప్లేస్..
అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ జట్టులో భారత దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనికి స్థానం దక్కలేదు. 14 ఏళ్ల పాటు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ధోని రెండు ప్రపంచకప్లను అందించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 15 వేలకు పైగా పరుగులు సాధించాడు.
Duleep Trophy 2024 : దులీప్ ట్రోఫీని ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?
ఇక ధోనికి స్థానం కల్పించకపోవడం పై పలువురు దినేశ్ కార్తీక్ పై మండిపడుతున్నారు. ధోని కంటే ముందే డీకే టీమ్ఇండియా తరుపున ఆడిన విషయం తెలిసిందే. ధోని రాకతో డీకేకు అవకాశాలు రాలేదు. ధోని గైర్హజరీలో మాత్రమే దినేశ్కు ఛాన్స్లు వచ్చాయి. దీంతో దీన్ని దృష్టిలో ఉంచుకుని ధోనిపై ఉన్న అక్కసుతోనే అతడికి తన జట్టులో దినేశ్ కార్తీక్ చోటు ఇవ్వలేదని అంటున్నారు.
దినేశ్ కార్తీక్ భారత అత్యుత్తమ జట్టు ఇదే..
వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖన్. 12 ఆటగాడిగా హర్భజన్ సింగ్.
