Team India : గిల్కు నో ప్లేస్.. నెక్ట్స్ గంభీరేనా? కొత్త కోచ్ వేటలో బీసీసీఐ?
టీ20ల్లో వైస్ కెప్టెన్ అయినప్పటికి కూడా గిల్ను (Team India ) తొలగించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
- Thota Vamshi Kumar
- Published On : December 28, 2025 / 01:58 PM IST
Disarray In Team India after Shubman Gill T20 World Cup 2026 Snub report
Team India : ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే చాలా దేశాల క్రికెట్ బోర్డులు ఈ మెగాటోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించాయి. ఇక బీసీసీఐ కూడా ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది. అయితే.. ఈ జట్టులో టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు చోటు దక్కలేదు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం మాజీ ఆటగాళ్లతో పాటు ఎంతో మంది క్రికెట్ అభిమానులకు దిగ్భ్రాంతికి గురి చేసింది.
టీ20ల్లో వైస్ కెప్టెన్ అయినప్పటికి కూడా గిల్ను తొలగించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు ప్రధాన కారణం ఇటీవల అతడు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పేలవ ఫామ్ను కలిగి ఉండడమే. ఏదీ ఏమైనప్పటికి కూడా టెస్టు, వన్డే కెప్టెన్, టీ20ల్లో వైస్ కెప్టెన్ అయిన గిల్కు స్థానం దక్కకపోవడం అనేది జట్టులో తీవ్ర చర్చకు దారి తీసిందని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
జట్టులోని ఆటగాళ్లలో వారి వారి స్థానాల గ్యారెంటీ పై ఆందోళన నెలకొందని పేర్కొంటున్నాయి. గిల్నే టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించినప్పుడు తమలో ఎవరిపైనా అయిన వేటు పడొచ్చునని వాళ్లు భావిస్తున్నారట.
వైట్ బాల్లో అద్భుతం, రెడ్ బాల్ కు వచ్చే సరికి..
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. అతడి కోచింగ్లోనే భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ 2025, ఆసియాకప్ 2025 ను కైవసం చేసుకుంది. అయితే.. టెస్టుల విషయానికి వస్తే మాత్రం ఘోర రికార్డును కలిగి ఉన్నాడు. సెనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల చేతుల్లో 10 టెస్టుల్లో భారత్ ఓడిపోయింది.
ఇక గత నెలలో స్వదేశంలో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఈ క్రమంలో టెస్టు కోచ్గా గంభీర్ ను తప్పించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే భారత జట్టు మాజీ ఆటగాడు లక్ష్మణ్తో సంప్రదింపులు జరిపిందట.
Yashasvi Jaiswal : 15 రోజుల ముందే జైస్వాల్కు ఆ విషయాన్ని చెప్పేసిన రోహిత్ శర్మ.. అందుకే అలాగా..
దక్షిణాఫ్రికాతో సిరీస్ అనంతరం బీసీసీఐలోని ఓ కీలక అధికారి వీవీఎస్ లక్ష్మణ్తో సంప్రదింపులు జరిపాడని, టెస్టు జట్టు కోచ్గా పని చేయాలన్న ఆసక్తి ఉందా అని అతడిని అడిగినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే.. కోచ్ పదవిపై లక్ష్మణ్ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.
వాస్తవానికి 2027 వన్డే ప్రపంచకప్ వరకు బీసీసీఐతో గంభీర్కు కాంట్రాక్ట్ ఉంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్టును సమీక్షించే అవకాశాలు లేకపోలేదని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత గడ్డపై జరిగే 2026 ప్రపంచకప్లో ఫలితంపైనే గంభీర భవిష్యత్తు ఆధాపడి ఉంటుందని అంటున్నారు. భారత జట్టు టీ20 ప్రపంచకప్ను నిలబెట్టుకున్నా లేదంటే కనీసం ఫైనల్ చేరుకున్నా కూడా గంభీర్ పదవికి ముప్పు ముప్పు లేదని అంటున్నారు. అతడికి భారత క్రికెట్లో అధికార వర్గాల నుంచి గట్టి మద్దతు ఉన్నప్పటికి కూడా టెస్టుల్లో అతడు కోచ్గా కొనసాగుతాడా? లేదా అన్నది ఆసక్తికరంగా ఉంది.
