ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే. ముంబై తీసుకున్న ఈ నిర్ణయం పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంత అర్థాంతరంగా రోహిత్ ను తప్పించాల్సిన పని ఏముందని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో రోహిత్ శర్మ ఉన్న ఫోటోను అతడు పోస్ట్ చేశాడు.
ఇదే జరిగితే అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో అతడిని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతోనే బద్రీనాథ్ ఈ ఫోటోను పోస్ట్ చేసి ఉంటాడని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే.. చెన్నైకి కెప్టెన్గా రోహిత్ ఉంటాడని, ధోని మెంటార్గా వచ్చేస్తాడని అంటున్నారు.
Suryakumar Yadav : పాండ్యకు కెప్టెన్సీ.. తన గుండె బద్దలైందన్న సూర్యకుమార్
What If 🤔 #MI #CSK #IPL2024 pic.twitter.com/wmrIauLv4U
— S.Badrinath (@s_badrinath) December 16, 2023
చెన్నై విషయానికి వస్తే..
మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెలుచుకున్న జట్టుగా రికార్డులకు ఎక్కింది. కాగా.. ఐపీఎల్ 2023లో మహేంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. అదే అతడి చివరి సీజన్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే.. ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. శరీరం సహకరిస్తే వచ్చే సీజన్లోనూ ఆడతానని చెప్పాడు.
Rohit Sharma : కెప్టెన్సీ మార్పు.. ముంబైకి షాక్ ఇస్తున్న ఫ్యాన్స్.. 4 లక్షల మంది వెళ్లిపోయారు
ఐపీఎల్ 2023 తరువాత మోకాలికి ధోని శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే.. ధోని పూర్తిగా కోలుకున్నాడో లేదో అన్న సంగతి తెలియరాలేదు. కాగా.. ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 19న జరగనుండడంతో చెన్నై జట్టును ధోనీని అట్టిపెట్టుకుంది. దీంతో మహేంద్రుడు వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడుతాడని అభిమానులు ఆనందపడుతున్నారు. అయితే.. ధోని వయసు దృష్ట్యా అదే అతడి చివరి సీజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతడి తరువాత చెన్నై జట్టును ఎవరు నడిపిస్తారు అన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ క్రమంలో బద్రీనాథ్ చేసిన పోస్ట్ నిజం కావాలని పలువురు చెన్నై అభిమానులు కోరుకుంటున్నారు.