IPL 2024 – Mayank Yadav : ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. మూడు మ్యాచులు ఆడినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ ఓ రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్లో చివరి బంతికి అతడు రికార్డు స్థాయిలో 157.4 కి.మీ వేగంతో బంతిని వేశాడు.
ఈ క్రమంలో అతడు లక్నో పేసర్ మయాంక్ యాదవ్ను అధిగమించాడు. రెండు రోజుల క్రితం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ మయాంక్ 155.8 కి.మీ వేగంతో బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వేగవంతమైన బంతిని సంధించిన ఘనత ఆస్ట్రేలియా పేసర్ షాన్ టైట్ పేరిట ఉంది. అతడు 157.71కి.మీ వేగంతో బంతిని వేశాడు. ఈ రికార్డును గెరాల్డ్ కోయెట్జీ తృటిలో చేజార్చుకున్నాడు. కోయెట్జీ వేసిన వేగవంతమైన బంతిని రియాన్ పరాగ్ బౌండరీకి తరలించడం విశేషం.
MS Dhoni : మెరుపు ఇన్నింగ్స్ అనంతరం.. విశాఖ గ్రౌండ్స్మెన్తో ధోని.. పిక్ వైరల్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 నష్టానికి 125 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (34), తిలక్ వర్మ(32) లు రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, చాహల్ లు చెరో మూడు వికెట్లు తీశారు. నండ్రే బర్గర్ రెండు, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రియాన్ పరాగ్ (54నాటౌట్) హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఆర్ఆర్ మూడు మ్యాచులు ఆడగా అన్నింటిలోనూ గెలిచింది. అటు ముంబై పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆడిన మూడు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.