MI Skipper Hardik Pandya : పంజాబ్ కింగ్స్ పై గెలిచిన జోష్లో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఊహించని షాక్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. అతడికి రూ.12లక్షల జరిమానా విధించారు. పంజాబ్తో మ్యాచ్లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లును పూర్తి చేయడంలో విఫలమైంది. దీంతో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్కు ఫైన్ పడింది. ఈ సీజన్లో ముంబైకి ఇదే తొలి తప్పిదం కావడంతో కెప్టెన్కు జరిమానాతో సరిపెట్టారు.
‘పంజాబ్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా చివరి రెండు ఓవర్లలో ముంబై జట్టు సర్కిల్ అవతల కేవలం నలుగురు ఫీల్డర్లతోనే ఆడాల్సి వచ్చింది. తొలి తప్పిదం కాబట్టి హార్దిక్ కు రూ.12లక్షలు జరిమానా విధించాం.’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది.
Virat Kohli : విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం.. జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాం
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (78; 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (34 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ ( 41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు పోరాడినప్పటికీ 9 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.