Virat Kohli : విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం.. జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాం
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది.
Virat Kohli wax statue : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా విరాట్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ తెలిపారు.
గత ఏడాది కాలంగా పర్యాటకులు, ముఖ్యంగా పిల్లలు, యువత నుంచి కోహ్లి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రపంచ వారసత్వ దినోత్సవం అయిన ఏప్రిల్ 18న కోహ్లి విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టినట్లు వెల్లడించాడు. ఈ విగ్రహం బరువు 35 కిలోలు అనీ.. దీన్ని తయారు చేసేందుకు రెండు నెలలకు పైగా సమయం పట్టిందన్నారు.
Viral : సీఎస్కే లోగోను ఇలా కూడా వాడతారా? ఐపీఎల్ థీమ్తో పెళ్లి పత్రిక
నహర్ఘర్ కోట ప్రాంగణంలో ఉన్న ఈ మ్యూజియంలో 44 మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇందులో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి వారితో పాటు ప్రముఖులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఏపీజే అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, కల్పనా చావాలా, అమితాబ్ బచ్చన్, మదర్ థెరిసా విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్లో బిజీగా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆర్సీబీ ఏడు మ్యాచులు ఆడగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. ఒక్క మ్యాచులోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. జట్టు ఓడిపోతున్నప్పటికీ వ్యక్తిగతంగా కోహ్లి రాణిస్తున్నాడు. ఏడు మ్యాచుల్లో 361 పరుగులు సాధించి టోర్నీ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు.