Neeraj Chopra : నీరజ్ చోప్రా సాధించిన చారిత్రాత్మక విజయాలు ఇవే..!
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జావెలియన్ ను నీరజ్ 88.17మీటర్ల దూరం విసిరి గోల్డ్ను ముద్దాడాడు.
- Thota Vamshi Kumar
- Published On : August 28, 2023 / 07:42 PM IST
Neeraj Chopra
Neeraj Chopra historic achievements : జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జావెలియన్ ను నీరజ్ 88.17 మీటర్ల దూరం విసిరి గోల్డ్ను ముద్దాడాడు. పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీమ్ (87.82) రజతం, చెక్కు చెందిన వద్లెచ్ (86.67) కాంస్యం పతకాలను సొంతం చేసుకున్నారు.
హరియాణాలోని పానిపట్ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన ఓ సామాన్యమైన కుటుంబంలో నీరజ్ జన్మించాడు. 17 మంది ఉన్న ఉమ్మడి కుటుంబంలో పెరిగాడు. చదువుకుంటూనే 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్ షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్ షిప్లో పాల్గొన్నాడు. అయితే.. అక్కడ పతకాలు సాధించకపోయినా మంచి ప్రదర్శననే ఇచ్చాడు. 2016లో ప్రపంచ అండర్ 20 ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి వెలుగులోకి వచ్చాడు. ఆ టోర్నీలో జావెలిన్ను 86.48 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డును అందుకున్నాడు.
ఇక భువనేశ్వర్ వేదికగా 2017లో జరిగి ఆసియా చాంపియన్షిప్లో పసిడి గెలిచాడు. 2018లో ఆసియా క్రీడలతో పాటు కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్2020లో స్వర్ణాన్ని ముద్దాడాడు. 2022లో ప్రపంచ చాంపియన్షిప్స్లో రజతం గెలుచుకున్నాడు. అదే ఏడాది జరిగిన డైమండ్ లీగ్లో గోల్డ్తో మెరిశాడు. ఇక 2023 ప్రపంచ చాంపియన్ షిప్లో స్వర్ణ పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెప లాడించాడు. తాజా ఫీట్తో అథ్లెటిక్స్లోని అన్ని మేజర్ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన త్రోయర్గా రికార్డులకు ఎక్కాడు.
