యావత్ భారతదేశమంతా రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా వేషధారణ చూసి గర్విస్తోంది. ఆర్మీ క్యాప్లతో బరిలోకి దిగిన భారత్.. మ్యాచ్ గెలిస్తే ఫీజు మొత్తం నేషనల్ డిఫెన్స్ ఫోర్స్కు విరాళంగా ఇస్తామంటూ ప్రకటించి ఉదారమైన మనస్సును చాటుకుంది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాత్రం మూడో వన్డేలో ఆర్మీ క్యాప్లు ధరించడం పట్ల అయిష్టత వ్యక్తం చేస్తోంది.
Read Also : వెటకారమా గంగూలీ : ధోనీ రిటైర్మెంట్ ఏంటీ.. ఎన్నాళ్లయినా ఆడొచ్చు
ఈ విషయం పట్ల పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురైషీ ఐసీసీని ప్రశ్నిస్తున్నాడు. ‘ప్రపంచమంతా చూస్తుంది. టీమిండియా సొంత క్యాప్లకు బదులు ఆర్మీ క్యాప్లు ధరించింది. కానీ, ఐసీసీకి మాత్రం ఇది కనిపించలేదా? ఐసీసీ బాధ్యతగా వ్యవహరించి పీసీబీ(పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చెప్పకముందే ఈ విషయంపై విచారణ జరిపితే బాగుంటుంది’ అని ఖురైషీ తెలిపాడు.
పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి సైతం ఈ ఘటన పట్ల తన స్పందనను ఇలా తెలియజేశాడు. ‘ఇది కేవలం క్రికెట్ మాత్రమే కాదు. కశ్మీర్లో భారత్ జరిపిన దాడులపై స్పందిస్తూ.. ఇలాంటివి భారత్ ఆపకపోతే పాకిస్తాన్ కూడా చేతికి నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగాల్సి ఉంటుంది’ అని ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.