Rohit Sharma : బౌలింగ్ వేసి వికెట్ తీసిన రోహిత్ శర్మ.. స్టేడియంలో సతీమణి రితికా సజ్దే సంబరాలు .. వీడియో వైరల్
ఇండియా - నెదర్లాండ్స్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ వేసి చివరి వికెట్ తీయడంతో స్టేడియం మొత్తం రోహిత్ నామస్మరణతో మారుమోగిపోయింది. స్టేడియంలో మ్యాచ్ ను వీక్షిస్తున్న రోహిత్ సతీమణి రుతిక సజ్దే..
- Harishth Thanniru
- Published On : November 13, 2023 / 09:51 AM IST
Rohit Sharma Wife Ritika
Rohit Sharma Wife Ritika Sajdeh : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అదరగొడుతుంది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు తొమ్మిది మ్యాచ్ లలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఓటమి లేకుండా సెమీస్ లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆదివారం భారత్ తన చివరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో 160 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ మినహా మిగిలిన ప్లేయర్స్ అందరూ బౌలింగ్ వేశారు.
Also Read : IND vs NED : నెదర్లాండ్స్ పై టీమ్ ఇండియా ఘన విజయం.. తొమ్మిదికి తొమ్మిది..
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ లుసైతం నెదర్లాండ్స్ మ్యాచ్ లో బౌలింగ్ వేశారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ చివరిలో అంటే 48వ ఓవర్లో బౌలింగ్ వేశాడు. ఐదు బాల్స్ వేసి ఒక వికెట్ తీసుకొని మ్యాచ్ ను ముగించేశాడు. రోహిత్ వేసిన ఐదో బంతికి నెదర్లాండ్స్ బ్యాటర్ తేజ నిడమనూరు భారీ షాట్ కొట్టాడు.. దానిని బౌండరీ లైన్ వద్ద మహ్మద్ షమీ క్యాచ్ పట్టాడు. రోహిత్ శర్మకు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలివికెట్.
రోహిత్ శర్మ చివరి వికెట్ తీయడంతో స్టేడియం మొత్తం రోహిత్ నామస్మరణతో మారుమోగిపోయింది. స్టేడియంలో మ్యాచ్ ను వీక్షిస్తున్న రోహిత్ సతీమణి రుతిక సజ్దే చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ చేసి కనీసం ఒక వికెట్ తీసిన తొమ్మిదో భారత క్రికెటర్ రోహిత్ శర్మ.
ఇదిలాఉంటే లీగ్ దశలో ఓటమి లేకుండా సెమీస్ కు వెళ్లిన రోహిత్ సేన బుధవారం (నవంబర్ 15న) సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.
