Thilk varma
Tilak Varma ind a vs aus a ODI : ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ చెలరేగిపోయాడు. ఆసియాకప్ ఫైనల్ (Asia Cup Final) పాకిస్థాన్ జట్టుపై అద్భుత బ్యాటింగ్తో భారత జట్టును విజేతగా నిలిపిన తిలక్ వర్మ.. తాజాగా.. ఆస్ట్రేలియా -ఏ జట్టుపై మ్యాచ్ లోనూ పరుగుల వరద పారించాడు. కానీ, కొద్దిలో అతను సెంచరీ మిస్ చేసుకున్నాడు.
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ -ఏ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (1), అభిషేక్ శర్మ (0) వెంటవెంటనే ఔట్ అయ్యారు. తొలి వన్డేలో సెంచరీ చేసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (8) కూడా త్వరగా ఔట్ అయ్యాడు. ఒక దశలో భారత్ జట్టు మూడు వికెట్లకు 17పరుగులు మాత్రమే చేసింది.
తిలక్ వర్మ 122 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. రియాన్ పరాగ్ (58) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో తిలక్ వర్మ, రియాన్ పరాగ్ 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరిలో రవి బిష్ణోయ్ 26 పరుగులు చేశాడు. దీంతో ఇండియా-ఎ జట్టు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది.
247 పరుగుల లక్ష్యంతో ఆసీస్ బ్యాటర్లు మెకెంజీ హార్వే, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ లు క్రీజులోకి వచ్చారు. 5.5ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేశారు. ఆ సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. మూడు గంటల ఆలస్యం తరువాత ఆస్ట్రేలియాకు DLS పద్ధతి ప్రకారం 25ఓవర్లలో ఛేదనకు 160 పరుగులు చేయాల్సి వచ్చింది. జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ (36) ఔట్ కాగా.. మెకెంజీ హార్వే(70నాటౌట్), కూపర్ కొన్నోలీ (50 నాటౌట్) రాణించడంతో 16.4 ఓవర్లలో ఆస్ట్రేలియా-ఏ జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసి విజేతగా నిలిచింది.