IND vs ENG 4th test : రాంచీలో రఫ్ఫాడిస్తున్న ఇంగ్లాండ్‌.. క‌ష్టాల్లో టీమ్ఇండియా.. ముగిసిన రెండో రోజు ఆట‌

రాంచీ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ప‌ట్టు బిగిస్తోంది.

IND vs ENG 4th test

IND vs ENG : సిరీస్‌లో నిల‌బ‌డాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రాణిస్తోంది. రాంచీ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ప‌ట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 353 ప‌రుగులు చేసింది. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఏడు వికెట్లు కోల్పోయి 219 ప‌రుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (30), కుల్దీప్ యాద‌వ్ (17) లు క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా ఇంకా 134 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

య‌శ‌స్వి ఒక్క‌డే..

ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసిన త‌రువాత టీమ్ఇండియా బ్యాటింగ్ ఆరంభించింది. ఈ సిరీస్‌లో ఒక్క ఇన్నింగ్స్ మిన‌హా మిగిలిన వాటిల్లో విఫ‌లం అయిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న పేల‌వ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ 2 ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు. అత‌డిని జేమ్స్ అండ‌ర్స‌న్ పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో భార‌త్ 4 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ ద‌శ‌లో ఇన్నింగ్స్ న‌డిపించే బాధ్య‌త‌ను వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన శుభ్‌మ‌న్ గిల్‌(38) తో క‌లిసి య‌శ‌స్వి జైస్వాల్ (73) భుజాన వేసుకున్నాడు.

Sachin Tendulkar : చెప్పిన‌ట్లుగానే అమీర్‌ను క‌లిసిన స‌చిన్‌.. స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చాడు

ఓ వైపు గిల్ ఆచితూచి ఆడ‌గా.. మ‌రో వైపు త‌న‌దైన శైలిలో జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. గిల్ ఔటైనా ఫామ్‌ను కొన‌సాగిస్తూ ఈ సిరీస్‌లో మ‌రో అర్ధ‌శ‌త‌కాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. గిల్‌-జైస్వాల్ జోడి రెండో వికెట్‌కు 84 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది. ర‌జ‌త్ పాటిదార్‌(17), ర‌వీంద్ర జ‌డేజా (12) లు మంచి ఆరంభాలు ల‌భించిన వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌డంలో విఫ‌లం అయ్యారు. వీరితో పాటు య‌శ‌స్వి జైస్వాల్ సైతం స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్‌కు చేరాడు. దీంతో భార‌త్ 161 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు కోల్పోయింది. రోహిత్ మిన‌హా మిగిలిన వారిని బ‌షీర్ ఔట్ చేశాడు.

యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ (14) ఆదుకుంటాడ‌ని భావించిన‌ప్ప‌టికీ అది జ‌ర‌గ‌లేదు. అత‌డితో పాటు అశ్విన్ (1) ను టామ్‌హార్డ్లీ ఔట్ చేశాడు. దీంతో భార‌త్ 177 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్న‌ప్ప‌టికి మ‌రో వైపు ధ్రువ్ జురెల్ నిలబ‌డ్డాడు. అత‌డు కుల్దీప్ యాద‌వ్‌తో క‌లిసి మ‌రో వికెట్ ప‌డ‌నీయ‌కుండా రెండో రోజును ముగించాడు. కుల్దీప్‌-ధ్రువ్ జోడీ అభేద్య‌మైన ఎనిమిదో వికెట్ 42 ప‌రుగులు జోడించింది.

51 ప‌రుగులు 3 వికెట్లు..

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 302/7తో రెండో రోజు ఆట‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ మ‌రో 51 ప‌రుగులు జోడించి మిగిలిన మూడు వికెట్ల‌ను కోల్పోయింది. సెంచ‌రీ హీరో జోరూట్ (122నాటౌట్) అజేయంగా నిల‌వ‌గా 31 ప‌రుగుల‌తో బ్యాటింగ్ ఆరంభించిన రాబిన్స‌న్ (58) అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ స‌మ‌యంలో ర‌వీంద్ర జ‌డేజా విజృంభించి రాబిన్స‌న్‌తో పాటు షోయ‌బ్ బ‌షీర్‌ల‌ను ఒకే ఓవ‌ర్‌లో పెవిలియ‌న్‌కు చేర్చాడు.

David Warner : డేవిడ్ వార్న‌ర్‌కు గాయం.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా?

మ‌రికాసేటికే అండ‌ర్స‌న్‌ను సైతం అత‌డే ఔట్ చేయ‌డంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా నాలుగు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సిరాజ్ రెండు వికెట్లు తీయ‌గా అశ్విన్ ఓ వికెట్ సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు