IND vs ENG 1st ODI : హమ్మయ్య.. ఇంగ్లాండ్పై భారత్ విజయం.. కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక కామెంట్స్.. అత్యంత సంతోషం కలిగించిన అంశం ఇదే..
IND vs ENG 1st ODI : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది.
- Harish Thanniru
- Published on- July 15, 2026 / 06:57 AM IST
Captain Shubman Gill made key comments after india first odi win against england
- తొలివన్డేలో ఇంగ్లాండ్ పై భారత్ జట్టు విజయం
- ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు
- రాణించిన శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, సుందర్
IND vs ENG 1st ODI : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. టీ20ల్లో వరుసగా ఆరు పరాజయాలతో ఫ్యాన్స్ను నిరాశపర్చిన భారత జట్టు.. తొలి వన్డేలో విజృంభించింది. దీంతో ఎట్టకేలకు భారత అభిమానులకు ఊరట దక్కింది.
Also Read : Ryan ten Doeschate : ఇంగ్లాండ్ సిరీస్ తరువాత.. భారత అసిస్టెంట్ కోచ్ పదవికి డస్కటే రాజీనామా!
భారత కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. భారత జట్టు లక్ష్య చేధనలో ఆరంభంలో తడబాటుకు గురైనప్పటికీ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (75 బంతుల్లో 80 రిటైర్ట్హర్ట్; 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (63 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అక్షర్, సుందర్ ఐదో వికెట్కు 105 బంతుల్లో అభేద్యంగా 102 పరుగులు జత చేశారు. సిరీస్లో భారత్ 1–0తో పైచేయి సాధించగా… కార్డిఫ్లో రేపు రెండో వన్డే జరుగుతుంది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. “మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా పరుగులు చేసి మ్యాచ్ను జట్టుకు విజయవంతంగా ముగిస్తే కెప్టెన్గా, టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్గా కూడా ఎంతో ఆత్మవిశ్వాసం వస్తుందని గిల్ అన్నారు. నిజానికి టాస్ గెలిచినా మేము ముందు బౌలింగ్ చేయాలని భావించాం. మా బౌలింగ్ విభాగం యువ ఆటగాళ్లతో ఉంది. బ్యాటింగ్ మాత్రం అనుభవజ్ఞులతో కూడినది. అందుకే సిరీస్ తొలి మ్యాచ్లో ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. ప్రత్యర్థి 320 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా, మా బ్యాటింగ్ లైనప్పై మాకు పూర్తి నమ్మకం ఉంది.
మధ్య ఓవర్లలో మా బౌలర్లు బౌలింగ్ వేసిన తీరు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ దశలో ప్రత్యర్థిని దాదాపు 10 ఓవర్లలో 50కి పైగా పరుగులకే పరిమితం చేశాం. తొలి 6-7 ఓవర్లలో బంతి బాగా స్వింగ్ అవుతూ, పిచ్ నుంచి కూడా సహకారం లభించింది. మా బౌలర్లు సరైన లెంగ్త్లో బంతులు వేయడంతో మంచి ఫలితం వచ్చింది. అయితే, పవర్ప్లే చివర్లో ప్రత్యర్థి జట్టు మాపై కొంత ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత మేము అద్భుతంగా పుంజుకుని వరుసగా ఐదు వికెట్లు తీసుకోవడం మ్యాచ్లో కీలక మలుపు అని గిల్ పేర్కొన్నారు.
2027 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని మేము విభిన్న కాంబినేషన్లను పరీక్షిస్తున్నాం. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఏ కాంబినేషన్ జట్టుకు మెరుగైన సమతుల్యతను ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని గిల్ అన్నాడు. ఈ మ్యాచ్ జరిగిన పిచ్, ఇక్కడి పరిస్థితులు దక్షిణాఫ్రికాలో ఉండే పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బంతి కదులుతూ, అదనపు బౌన్స్ కూడా లభించింది. అయితే, కొంతసేపటి తర్వాత పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. దక్షిణాఫ్రికాలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వికెట్లపై విభిన్న కాంబినేషన్లను పరీక్షించడం మాకు ఎంతో ఉపయోగపడుతుందని శుభ్మన్ గిల్ చెప్పారు.
