Shubman Gill : రోహిత్ శర్మ ఫామ్ పై శుభ్మన్ గిల్ కామెంట్స్..
రోహిత్ శర్మ ఫామ్ పై విలేకరుల సమావేశంలో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill ) స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Published On : January 19, 2026 / 03:34 PM IST
IND vs NZ Shubman Gill comments on Rohit Sharma Poor Form
- న్యూజిలాండ్కు వన్డే సిరీస్ కోల్పోయిన భారత్
- ఈ సిరీస్లో విఫలమైన రోహిత్ శర్మ
- హిట్మ్యాన్కు మద్దతుగా నిలిచిన కెప్టెన్ గిల్
Shubman Gill : ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. భారత గడ్డపై ఆ జట్టుకు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం.
కాగా.. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. వడోదర వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో 26 పరుగులు చేసిన రోహిత్ శర్మ రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 24 పరుగులు సాధించాడు. ఇక ఇండోర్లో 338 పరుగుల లక్ష్య ఛేదనలో హిట్మ్యాన్ రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
T20 World Cup 2026 : మరో మూడు వారాల్లో టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికాకు భారీ షాక్..!
మొత్తంగా రోహిత్ శర్మ మూడు ఇన్నింగ్స్ల్లో 20.33 సగటుతో 61 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ పై మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్కు ప్రశ్న ఎదురైంది.
ఆస్ట్రేలియా సిరీస్ నుంచి శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని గిల్ తెలిపాడు. అయితే న్యూజిలాండ్ సిరీస్లో అనుభవజ్ఞుడైన ఓపెనర్ తన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడని చెప్పాడు.
Kohli-Rohit : రోహిత్, కోహ్లీ భారత జెర్సీలో మళ్లీ కనిపించేది అప్పుడేనా?
‘రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లలో అతడు పరుగులు చేశాడు. ఇక కివీస్తో సిరీస్లో మంచి ప్రారంభాలను పొందాడు. అయితే.. వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఓ బ్యాటర్ ప్రతిసారి భారీ స్కోర్లు చేయడం సాధ్యం కాదు. ప్రతి మ్యాచ్లో సెంచరీ చేయడం సాధ్యం కాదు.’ అని గిల్ అన్నాడు.
ఇక మూడో వన్డే మ్యాచ్ విషయానికి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) శతకాలు బాదారు. అనంతరం విరాట్ కోహ్లీ (124) శతకంతో చెలరేగగా, నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) హాఫ్ సెంచరీలతో రాణించనప్పటికి భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే కుప్పకూలింది.
