వెస్టిండీస్‌తో భారత్ షెడ్యూల్: హైదరాబాద్, వైజాగ్ వేదికగా మ్యాచ్‌లు

ఒక్క టెస్టు మ్యాచ్ మినహాయించి బంగ్లాదేశ్‌తో భారత మ్యాచ్‌లు ముగిశాయి. ఈ సిరీస్ అనంతరం జరగనున్న వెస్టిండీస్ తో మ్యాచ్ లకు షెడ్యూల్ విడుదల చేసేసింది భారత్. డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఢీకొట్టబోతోంది. ఈ మేరకు బీసీసీఐ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని రూపొందించింది. డిసెంబరు 6న మొదలుకానున్న ఈ సిరీస్‌లో రెండు జట్లు మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేల్ని డిసెంబరు 22 వరకూ ఆడనున్నాయి. 

ఈ సిరీస్‌ కోసం జట్టుని ప్రకటించేందుకు భారత సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. ఇటీవల ధోనీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో చూస్తే ఈ సిరీస్ కోసం సెలక్షన్‌కి అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, వెస్టిండీస్ మధ్య డిసెంబరు 6న వాంఖడే వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. రెండో టీ20 మ్యాచ్  8న తిరువనంతపురంలో నిర్వహించనున్నారు. ఇక ఆఖరి టీ20 మ్యాచ్‌కి 11న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. 

అనంతరం డిసెంబరు 15న చెన్నై వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుండగా.. 18న విశాఖపట్నం వేదికగా రెండో వన్డే, ఇక ఆఖరి వన్డేకి కటక్‌ 22న ఆతిథ్యమివ్వబోతోంది. టీ20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకి ప్రారంభంకానుండగా.. వన్డేలు మధ్యాహ్నం 2 నుంచి మొదలుకానున్నాయి.