బెంగళూరు టీ20.. పాకిస్థాన్ రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా?
బెంగళూరులో జరిగే మూడో T20I మ్యాచ్లో భారత్ గెలిస్తే మరో రికార్డు సొంతమవుతుంది. పాకిస్థాన్ రికార్డు బ్రేక్ అవుతుంది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : January 17, 2024 / 12:48 PM IST
Indian Cricket Team On Verge Of Beating Pakistan To Major T20I Feat
IND vs AFG 3rd T20I: భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ బెంగళూరు వేదికగా నేడు జరగనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇప్పటికే టీమిండియా కైవశం చేసుకుంది. చివరిదైన మూడో మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మొదటి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి జోరు మీదున్న రోహిత్ సేన బెంగళూరులోనూ సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి పాకిస్థాన్ రికార్డును బ్రేక్ చేయాలని టీమిండియా బరిలోకి దిగుతోంది. మరోవైపు చివరి మ్యాచ్లో ఇండియాకు షాక్ ఇవ్వాలని అఫ్గానిస్తాన్ గట్టిగా ప్రయత్నిస్తోంది.
బెంగళూరులో జరిగే మూడో T20I మ్యాచ్లో భారత్ గెలిస్తే మరో రికార్డు సొంతమవుతుంది. భారత్, పాకిస్థాన్ ఇప్పటివరకు 8 సార్లు ద్వైపాక్షిక సిరీస్లను వైట్వాష్ చేసి సమంగా నిలిచాయి. అయితే ఈరోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే 9 క్లీన్ స్వీప్ లతో టీమిండియా టాప్లో ఉంటుంది. అంతేకాదు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డుకెక్కుతుంది. అఫ్గానిస్తాన్తో జరిగే మ్యాచ్ లో గెలిచి ఈ రికార్డు సాధించాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బెంగళూరు మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు.
ధోని రికార్డును రోహిత్ అందుకుంటాడా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ T20 మ్యాచ్ల్లో ఇండియాకు 41 విజయాలు అందించి ఎంఎస్ ధోని సరసన నిలిచాడు. ధోని తన కెరీర్లో 72 టీ20 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించి ఈ ఘనత సాధించగా.. రోహిత్ కేవలం 53 మ్యాచ్ల్లోనే మిస్టర్ కూల్ రికార్డును సమం చేయడం విశేషం. అఫ్గానిస్తాన్తో జరిగే 3వ మ్యాచ్ లో విజయం సాధిస్తే ధోనిని రోహిత్ శర్మ అధిగమిస్తాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా T20I టీ20 మ్యాచ్లు ఆడగా 30 విజయాలు సాధించింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో 16 మ్యాచ్లు ఆడగా పదింట్లో గెలిచింది.
Also Read: మూడో టీ20కి ముందు.. భారత ఆటగాళ్లను కలిసేందుకు ఎవరొచ్చారో చూశారా..?
