MS Dhoni – Harleen Deol : మరో రెండు నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభం కానుంది. ఐపీఎల్ ఆరంభానికి చాలా సమయం ఉన్నప్పటికీ అందరి దృష్టి ఒకే ఒక్క ఆటగాడిపైనే ఉంది. అతడే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అతడు ఈ సీజన్లో ఆడతాడా..? ఇదే అతడికి చివరి సీజనా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. కాగా.. ఐపీఎల్ 2023 అనంతరం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోని దాని నుంచి కోలుకున్నాడు.
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఆరో టైటిల్ను సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. కోలుకున్న మహేంద్రుడు ఇటీవల ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే.
Also Read : నా లక్ష్యమదే.. అజింక్యా రహానే భావోద్వేగం..!
కాగా.. రాంచీలోని జెఎన్సిఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో ఎంఎస్ ధోనిని భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ కలిసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదండోయ్ ధోనితో కలిసి దిగిన ఫోటోను పంచుకుంటూ తాను ఇది నిజంగా నమ్మలేకపోతున్నానని చెప్పింది.
‘ఇదో అద్భుత క్షణం. నా ఆరాధ్య క్రికెటర్ ధోనితో గడిపిన ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాను. భారతదేశంలో చలికాలం ఎప్పుడో మొదలైంది. కానీ.. ఇది కెప్టెన్ కూల్ క్షణం. ఓ ఆటగాడిగా మిమ్మల్ని ఆరాధించేదానిని. కానీ ఇప్పుడు మిమ్మల్ని కలిసిన తరువాత ఓ వ్యక్తిగా కూడా ఆరాధిస్తున్నాను. మిమ్మల్ని కలిశాను అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కలలు నిజమైన క్షణం.’ అంటూ హర్లీన్ రాసుకొచ్చింది.