IPL 2020: చెన్నై టార్గెట్ 176

ఐపీఎల్‌-13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 176 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీ షా(64; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), శిఖర్‌ ధావన్‌(35; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 ఫోర్‌), శ్రేయస్‌ అయ్యర్‌(26), రిషబ్ పంత్‌(37; 25 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో ఢిల్లీ ఓ మోస్తారు స్కోరుతో గట్టెక్కింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌కు పృథ్వీ షా, ధావన్‌లు శుభారంభం అందించారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత ధావన్‌ ఔటయ్యాడు. పీయూష్‌ చావ్లా బౌలింగ్‌లో ధావన్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. మరో 9 పరుగుల వ్యవధిలో పృథ్వీ షా ఔట్‌ కావడంతో ఢిల్లీ 103 పరుగుల వద్ద రెండో వికెట్‌ను చేజార్చుకుంది.

అనంతరం రిషభ్‌ పంత్‌-శ్రేయాస్‌ అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ భాగస్వామ్యంలో 58 పరుగులు నమోదయ్యాయి. అనంతరం పంత్‌ ధాటిగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో పీయూష్‌ చావ్లా 2 వికెట్లు సాధించగా, శామ్‌ కరాన్‌కు వికెట్‌కు దక్కింది.