Shreyas Iyer : వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓటమి.. ప్రతి జింటా ముందు చేతులు కట్టుకుని శ్రేయస్ అయ్యర్.. ఎంత కష్టమొచ్చిందయ్యా నీకు..
తాము బౌలింగ్లో వికెట్లు తీయలేకపోయామని, వారు అద్భుతంగా ఆడారని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 18, 2026 / 10:44 AM IST
IPL 2026 Preity Zinta Serious Chat With Shreyas Iyer after PBKS vs RCB match (pic credit@ipl)
- వరుసగా ఆరో మ్యాచ్లో ఓడిపోయిన పంజాబ్
- ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం
- ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోయిన తరువాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో ప్రీతి జింటా తీవ్ర చర్చ
Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్ ఫస్టాఫ్లో ఓటమే ఎరుగని జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్ పరిస్థితి ప్రస్తుతం తారుమారు అయింది. తొలి ఏడు మ్యాచ్లు ముగిసే సరికి ఓటమే లేకుండా అవలీలగా శ్రేయస్ అయ్యర్ సేన ప్లేఆఫ్స్లో అడుగుపెడుతుందని అంతా భావించారు. అయితే.. ఆ తరువాత పరిస్థితి తలక్రిందులైంది. వరుసగా ఆరు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఆదివారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 23 పరుగులు తేడాతో పరాజయం పాలైంది. దీంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
వెంకటేష్ అయ్యర్ (73 నాటౌట్; 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేయగా.. దేవ్దత్ పడిక్కల్ (45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీశాడు. అర్ష్దీప్ సింగ్, చహల్లు చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శశాంక్ సింగ్ (56; 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్,రసిఖ్ సలాం దార్లు చెరో మూడు వికెట్లు తీశారు.జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రొమారియో షెపర్డ్ లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.
Seeing Preity Zinta man and Shreyas this sad really hurts 🥺😭💔
— Shreyass Eraa (@IyerShreyass) May 17, 2026
వరుసగా ఆరో మ్యాచ్లో ఓడిపోవడంతో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. డగౌట్లో ఒంటరిగా కూర్చోని తీవ్ర నిరాశలో కనిపించాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో జట్టు సహ యజమాని ప్రీతి జింటా తీవ్రంగా చర్చిస్తూ కనిపిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాము బౌలింగ్లో వికెట్లు తీయలేకపోయామని, వారు అద్భుతంగా ఆడారని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఆ తరువాత బ్యాటింగ్లో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ను కోల్పోయామని చెప్పుకొచ్చాడు. ఇక ప్లేఆఫ్స్ అవకాశాల గురించి మాట్లాడుతూ.. ఫలితాలతో సంబంధం లేకుండా తాను ఎప్పుడూ సానుకూలంగా ఉంటానని అన్నాడు. గతం గడిచిపోయిందని, తాను వర్తమానంలోనే ఉంటానని అన్నాడు. రేపు మళ్లీ తాను సూర్యదోయాన్ని చూడబోతున్నానని తెలిపాడు.
