KKR vs PBKS : కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఎవరికి లాభం అంటే?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం జరగనున్న కేకేఆర్ వర్సెస్ పంజాబ్ (KKR vs PBKS) మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.
- Thota Vamshi Kumar
- Published On : April 6, 2026 / 12:26 PM IST
IPL 2026 Rain Threat to KKR vs PBKS today match
- సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో తలపడనున్న పంజాబ్
- ఈ మ్యాచ్కు పొంచి ఉన్న వర్షం ముప్పు
- రద్దైతే ఇరు జట్లకు చెరొక పాయింట్
KKR vs PBKS : ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం పంజాబ్ కింగ్స్తో కోల్కతా నైట్రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో పంజాబ్ జట్టు విజయం సాధించింది. మరోవైపు కోల్కతా పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. కనీసం పంజాబ్ పై గెలిచి బోణీ కొట్టాలని ఆరాటపడుతోంది. అయితే.. కేకేఆర్ పై విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని పంజాబ్ ఆశిస్తోంది.
అయితే.. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 57 శాతం వర్షం పడే అవకాశం ఉందని ఐఎమ్డి వెల్లడించింది. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావొచ్చు లేదంటే ఓవర్ల సంఖ్యను కుదించే అవకాశం.
‘ఆదివారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) మరో విడత కల్బాయిశాఖి తుఫానులు సంభవించే అవకాశం ఉంది. వడగళ్ళు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారాల్లో వర్ష తీవ్రత, విస్తరణ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా.’ అని ఐఎమ్డి తెలిపింది.
మ్యాచ్కు ముందు రోజు (ఆదివారం ) మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా ఇరు జట్ల షెడ్యూల్డ్ ప్రాక్టీస్ సెషన్లను రద్దు చేశారు. ఈడెన్ గార్డెన్స్ అవుట్ఫీల్డ్ ను కవర్లతో కప్పి ఉంచారు.
మ్యాచ్ రద్దైతే ?
వర్షం అంతరాయం కలిగించే మ్యాచ్ల్లో ఫలితం తేల్చేందుకు ఇరు జట్లు కనీసం ఐదు ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు కూడా ఆడలేని పరిస్థితి ఉంటే అప్పుడు మ్యాచ్ను రద్దు చేస్తారు. ఇరు జట్లకు చెరొక పాయింట్ను కేటాయిస్తారు. అప్పుడు పంజాబ్ ఖాతాలో 5 పాయింట్లు ఉంటాయి. కేకేఆర్ ఖాతాలో ఓ పాయింట్ ఉంటుంది. వర్షం వల్ల గత సీజన్లో కేకేఆర్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది
గత సీజన్లో కూడా ఇక్కడ వర్షం పడి కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రద్దైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ 7/0 స్కోరుతో ఉన్నప్పుడు వర్షం పడింది. దీంతో మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ను కేటాయించారు.
