Kohli 49th ODI Hundred: కోహ్లీ ఏ జట్టుపై అత్యధిక సెంచరీలు చేశాడో తెలుసా? జట్ల వారిగా కోహ్లీ, సచిన్ సెంచరీల వివరాలు..
సచిన్ సెంచరీలు చేసిన 49 మ్యాచ్ లకు గాను భారత్ జట్టు 33సార్లు విజయం సాధించింది. కోహ్లీ శతకాలు సాధించిన 40 సార్లు టీమిండియా విజయం సాధించింది.
- Harishth Thanniru
- Published On : November 6, 2023 / 07:55 AM IST
Kohli 49th ODI Hundred
Virat Kohli : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేసి ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 49వ శతకం కావడం విశేషం. సచిన్ 452వ ఇన్నింగ్స్ (463 మ్యాచ్) లో 49వ వన్డే సెంచరీ అందుకుంటే.. కోహ్లీ 277వ ఇన్నింగ్స్ (289 మ్యాచ్)లోనే ఆ రికార్డు సమం చేయడం అతని దూకుడుకు నిదర్శనం.
సచిన్ సెంచరీలు చేసిన 49 మ్యాచ్ లకు గాను భారత్ జట్టు 33సార్లు విజయం సాధించింది. కోహ్లీ శతకాలు సాధించిన 40 సార్లు టీమిండియా విజయం సాధించింది. వన్డే క్రికెట్ లో కోహ్లిలా ఆధిపత్యం చెలాయిస్తున్న ఆటగాడు ప్రస్తుతం మరొకరు లేరు. కోహ్లీ ఆటతీరు అసామాన్యం. అతను ఒత్తిడికి చిత్తవడు. కోహ్లీ ఛేదనలో రారాజు. లక్ష్యం ఎంతున్నా, ఒకవైపు వికెట్లు పడుతున్నా.. బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నా.. కోహ్లీ మాత్రం ఒక్కో పరుగు చేస్తూ ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధిస్తుంటాడు.
సచిన్, కోహ్లీలు ఏఏ జట్టుపై ఎవరెన్ని సెంచరీలు చేశారనే వివరాలను పరిశీలిస్తే..
సచిన్ టెండూల్కర్ :- ఆస్ట్రేలియా (9 సెంచరీలు), శ్రీలంక(8), వెస్టిండీస్ (4), న్యూజిలాండ్ (5), బంగ్లాదేశ్ (1), పాకిస్థాన్ (5), దక్షిణాఫ్రికా (5), ఇంగ్లాండ్ (2), జింబాబ్వే (5), కెన్యా (4), నమీబియా (1)
విరాట్ కోహ్లీ :- ఆస్ట్రేలియా (8 సెంచరీలు), శ్రీలంక(10), వెస్టిండీస్ (9), న్యూజిలాండ్ (5), బంగ్లాదేశ్ (5), పాకిస్థాన్ (3), దక్షిణాఫ్రికా (5), ఇంగ్లాండ్ (3), జింబాబ్వే (1).
