IPL 2020, KXIP vs RCB: పంజాబ్‌తో ఓడినా.. రెండు రికార్డ్‌లు క్రియేట్ చేసిన కోహ్లీ..!

  • Publish Date - October 16, 2020 / 12:34 AM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపిఎల్ 2020లో 31 వ మ్యాచ్‌ను ఓడిపోయినా కూడా రెండు రికార్డ్‌లను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో 200వ మ్యాచ్‌. అదే కాదు.. కోహ్లీ బ్యాటింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును కూడా బద్దలు కొట్టాడు. విరాట్ ఐపిఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.



షార్జా మైదానంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 వ సీజన్ 31వ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఇన్నింగ్స్లో 10వ పరుగు చేశాక.. ఈ రికార్డ్‌లోకి ఎక్కాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఎంఎస్ ధోని 4275 పరుగులు చేసి ఈ రికార్డ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆ రికార్డ్‌ను అధిగమించాడు.



కెప్టెన్‌గా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో ఎంఎస్ ధోని 2 వ స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన గౌతమ్ గంభీర్, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 3518 పరుగులు చేసి కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీని సాధించాడు. ఇక ఆర్‌సిబి తరఫున ఛాంపియన్స్ లీగ్ టి20లో విరాట్ 15 మ్యాచ్‌లు ఆడాడు. ఈ విధంగా బెంగుళూరు జట్టుకు 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ కోసం ఇంతవరకు ఏ ఆటగాడు ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు. ఏ క్రికెటర్ కూడా ఒక ఫ్రాంచైజీ కోసం ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు.