Lord to host ICC Women T20 World Cup 2026 Final
వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగాటోర్నీ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. జూలై 5న లండన్లోని ప్రఖ్యాత స్టేడియం లార్డ్స్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 24 రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నీలో 33 మ్యాచ్లు జరగనున్నాయి. 12 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి.
లండన్లోని లార్డ్స్, మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, లీడ్స్లోని హెడింగ్లీ, బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్, సౌతాంప్టన్లోని హాంప్షైర్ బౌల్, లండన్లోని ది ఓవల్, బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
CSK vs PBKS : పంజాబ్ కింగ్స్తో చెన్నై ఆటగాడి వివాదం..! సైగలు చేస్తూ.. వీడియో వైరల్..
కాగా.. మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు లార్డ్స్ మైదానం ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
పాల్గొనే జట్లు ఇవే..
భారత్, పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే ప్రపంచకప్లో తమ స్థానాలను నిర్థారించుకున్నాయి. మరో నాలుగు జట్లను క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఫార్మాట్ ఇలా..
మొత్తం 12 జట్లను రెండు గ్రూపులు విభజిస్తారు. ఒక్కొ గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. దీని తరువాత నాకౌట్ దశ ఉంటుంది. ఆ తరువాత ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిఫెండింగ్ ఛాంపియన్గా న్యూజిలాండ్ ఈ టోర్నీలో అడుగుపెట్టనుంది. కాగా.. భారత మహిళల జట్టు ఇంత వరకు టీ20 ప్రపంచకప్ను ముద్దాడలేదు.
RR vs MI : రాజస్థాన్తో కీలక మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్కు భారీ షాక్..
‘2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ వైపు అడుగులు వేస్తున్నాం. ఇందులో వేదికల నిర్థారణ ఎంతో ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది. ఈ టోర్నమెంట్ ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారిణులను ఒక చోటుకు చేర్చుతుంది. నైపుణ్యం, క్రీడాస్ఫూర్తికి ఒక వేదిక అవుతుంది.’ అని ఐసీసీ ఛైర్మన్ జైషా అన్నారు.