Mallika Sagar Net Worth : ఐపీఎల్ వేలం నిర్వహించే మల్లికా సాగర్ బ్యాక్గ్రౌండ్ తెలుసా..? ఆమె ఆస్తుల విలువ ఎంతంటే..
Mallika Sagar Net Worth : ఐపీఎల్-2026 మినీ వేలంను మల్లికా సాగర్ నిర్వహించారు. గతంలోనూ ఆమె ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు..
- Harishth Thanniru
- Published On : December 16, 2025 / 09:05 PM IST
Mallika Sagar Net Worth
Mallika Sagar Net Worth : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం మినీ వేలం అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మినీ వేలంను మల్లికా సాగర్ నిర్వహించారు. గతంలోనూ ఆమె ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు.
గతంలో ఐపీఎల్ వేలంను రిచర్డ్ మ్యాడ్లీ, హ్యూ ఎడ్మీడ్స్, చారు శర్మ వంటి వారు నిర్వహించారు. కానీ, 2024 నుంచి మల్లికా సాగర్ ఈ కీలక బాధ్యతలను చేపడుతూ వస్తున్నారు. ఐపీఎల్ 2024 మినీ వేలంను, 2025లో మెగా వేలంను ఆమె విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా మల్లికా సాగర్ ఐపీఎల్ 2026 టోర్నమెంట్కు సంబంధించిన మినీ వేలంను నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆమె ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి..? ఆమె ఆస్తి విలువ ఎంత అనే వివరాల కోసం నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు.
మల్లికా సాగర్ 1975లో ముంబైలోని ఓ వ్యాపార కుటుంబంలో జన్మించారు. మల్లికా ఫిలడెల్ఫియాలోని బ్రెన్మౌర్ కాలేజీ నుంచి ఆర్ట్ హిస్టరీలో డిగ్రీ పూర్తి చేశారు. తన చిన్నతనంలో ఒక పుస్తకంలో మహిళా వేలంపాట నిర్వాహకురాలు ప్రధాన పాత్రగా ఉండటంతో.. ఆమెకు వేలంపాటపై ఆసక్తి పెరిగింది. ఫైన్ ఆర్డ్, క్రీడా ఈవెంట్ల వేలంపాట అనే రెండు విభిన్న రంగాలను కలిపే కెరీర్ను ఎంచుకున్నారు. మల్లికా సాగర్ కేవలం 26ఏళ్ల వయస్సులోనే న్యూయార్క్ లోని క్రిస్టీస్ అనే ప్రఖ్యాత సంస్థలో తొలి భారతీయ మహిళా వేలంపాట నిర్వాహకురాలిగా రికార్డు సృష్టించారు. ఆ సమయంలో మల్లికాకు గొప్ప గుర్తింపు వచ్చింది.
మల్లికా సాగర్ నికర విలువ దాదాపు 15 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.125 కోట్లు)గా అంచనా. ఆమె సంపద.. వేలం పరిశ్రమలో 20 సంవత్సరాలకుపైగా అత్యంత విజయవంతమైన కెరీర్ ను ప్రతిబింబిస్తుంది. మల్లికా ప్రో కబడ్డీ లీగ్ (PKL), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి ప్రధాన క్రీడా లీగ్ లకు వేలంపాటదారుగా ఆమె గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. అంతేకాదు.. ఎండార్స్మెంట్లు ద్వారా ఆమె సంపద పెరుగుదలకు దోహదపడింది.
2021లో ప్రో కబడ్డీ లీగ్ ద్వారా క్రీడా వేలం రంగంలోకి అడుగుపెట్టారు. ప్రో కబడ్డీ 8వ సీజన్ వేలంలో నిర్వాహకురాలిగా ఆమె వ్యవహరించారు. 2023లో జరిగిన మొదటి ఉమెన్స్ ప్రీమియర్ వేలాన్ని మల్లికా సాగర్ నిర్వహించారు. IPL 2024 మినీ-వేలం, IPL 2025 మెగా వేలంతో పాటు ఇటీవలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలాన్ని కూడా మల్లికా సాగర్ నిర్వహించింది. ప్రస్తుతం ఐపీఎల్ – 2026 టోర్నమెంట్ కు సంబంధించి మినీ వేలంను ఆమే నిర్వహించారు. ఫైన్ ఆర్ట్ ప్రపంచం నుంచి వచ్చి క్రీడా రంగంలో అతిపెద్ద వేలంపాటలను విజయవంతంగా నిర్వహిస్తూ మల్లికా సాగర్ భారత క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
