Mohammed Siraj viral dig on his role in T20 World Cup 2026
Mohammed Siraj : టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలో వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ను గెలిచిన జట్టుగా, టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకున్న తొలి ఆతిథ్య దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాదండోయ్ అత్యధిక సార్లు టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న ఘనతను సొంతం చేసుకుంది. భారత జట్టుకు ఇది మూడో టీ20 ప్రపంచకప్.
టీ20 ఛాంపియన్లుగా నిలవడంతో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత ఆటగాళ్లు భావోద్వేగానికి గురి అయ్యారు. పలువురు ఆటగాళ్లు మాట్లాడుతూ తమ ఫీలింగ్ను వెల్లడించారు. ఈ సమయంలోనే టీమ్ఇండియా పేసర్, హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ సైతం తన భావోద్వేగాన్ని తెలియజేశాడు. అంతేకాదండోయ్ టీ20 ప్రపంచకప్ గెలవడంతో తన వంతు పాత్రను చాలా ఫన్నీగా తెలియజేశాడు.
ప్రపంచకప్ గెలవడం ఎలా ఉంది? అని ప్రెజెంటర్ అడుగగా.. ‘మొత్తం జట్టు ఆనందంగా ఉంది. వాస్తవానికి నేను టీ20 ప్రపంచకప్ 2026 కోసం ప్రకటించిన జట్టులో తొలుత నేను. అయితే.. ఆ తరువాత అనుకోకుండా నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. జట్టులో భాగం అయ్యాను. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లు అయ్యాము. ఇది అంతా దేవుని స్ర్కిప్ట్.’ అని సిరాజ్ అన్నాడు.
కొన్ని సార్లు తుది జట్టులో లేకపోవడం నిరాశ కలిగిస్తుంది? ఈ ప్రపంచకప్లో మీ పాత్ర ఎంత పెద్దది ? అని ప్రెజెంటర్ మరో ప్రశ్నను అడిగాడు. దీనికి సిరాజ్ చాలా ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.
‘అవును భారత జట్టు ప్రపంచకప్ గెలవడంలో మేము (కుల్దీప్, సిరాజ్) చాలా పెద్ద పాత్ర పోషించాము. డగౌట్లో కూర్చోని ఆటగాళ్లకు నీరు అందించడం, వారి బ్యాట్లు పట్టుకోవడం, నెట్స్లో వారికి బౌలింగ్ చేయడం వంటి పనులు చేశాము. ఓ ప్లేయర్ ఎప్పుడు ఆడాలని కోరుకుంటాడు. అయితే.. ఇది టీమ్ గేమ్. కాంబినేషన్స్ కారణంగా మేము డగౌట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఏదీ ఏమైనప్పటికి కూడా మేము ప్రపంచకప్ గెలవడం మాత్రం చాలా ఆనందంగా ఉంది.’ అని సిరాజ్ అన్నాడు. సిరాజ్ చెప్పిన మాటలకు పక్కనే ఉన్న కుల్దీప్ యాదవ్ పగలబడి నవ్వాడు.
ప్రస్తుతం సిరాజ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్2026కు రెండు రోజుల ముందు పేసర్ హర్షిత్ రాణా గాయపడడంతో అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ను జట్టులోకి తీసుకున్నారు. తొలి మ్యాచ్లోనే సిరాజ్ ఆడాడు. అమెరికాతో జరిగిన ఈ మ్యాచ్లో సిరాజ్ 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆ తరువాత అతడు టోర్నీలో మరో మ్యాచ్ ఆడలేదు.
Mohammed Siraj and Kuldeep Yadav share their emotions after being crowned champions. 🏆❤️#Champions #INDvNZ pic.twitter.com/Omqg91W4nr
— Star Sports (@StarSportsIndia) March 8, 2026
ఇక కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే.. అతడు కూడా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. పాకిస్థాన్తో మ్యాచ్లో ఆడిన కుల్దీప్ ఓ వికెట్ పడగొట్టాడు.