Ajinkya Rahane
Ajinkya Rahane : టీమ్ఇండియాలోకి తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని, 100 టెస్టు మ్యాచులు ఆడడమే తన లక్ష్యమని సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే తెలిపాడు. పేలవ ఫామ్తో టీమ్ఇండియాలో చోటు కోల్పోయిన అతడు ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న ఈ ఆటగాడు ఆంధ్రాతో జరిగిన మ్యాచులో డకౌట్ కావడంతో విమర్శల పాలు అయ్యాడు. ఇక రహానే కెరీర్ ఖతం అని వార్తలు వస్తున్న క్రమంలో అతడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఐపీఎల్ 2023లో రాణించడంతో గతేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచులో మంచి ప్రదర్శన చేయడంతో వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక అయ్యాడు. అయితే.. వెస్టిండీస్ టూర్లో దారుణంగా విఫలం కావడం, అదే సమయంలో యువ ఆటగాళ్లు పోటీలోకి రావడంతో 35 ఏళ్ల ఈ సీనియర్ ఆటగాడికి అవకాశాలు కరువయ్యాయి.
తన ఫామ్ను అందుకునేందుకు రంజీట్రోఫీ 2024 ఆడుతున్నాడు. ముంబైకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. గాయం కారణంగా మొదటి మ్యాచ్కు దూరం అయ్యాడు. ఆంధ్రాతో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా జట్టులోకి వచ్చాడు. అయితే.. బ్యాటర్గా విఫలమైనప్పటికీ కెప్టెన్గా జట్టును గెలిపించాడు. టీమ్ఇండియా తరుపున రహానే 85 టెస్టు మ్యాచులు ఆడాడు. 38.5 సగటుతో 5077 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 26 అర్ధశతకాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్తో టీమ్ఇండియా ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. ఈ నెల 25 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుండగా మొదటి రెండు టెస్టు మ్యాచులకు జట్టును ప్రకటించారు. అయితే..రహానేకు మరోసారి చుక్కెదురైంది.
SA20 2024 : ఇలాంటి క్యాచ్ మీ జీవితంలో చూసి ఉండరు..! క్రికెట్ చరిత్రలోనే అద్భుత క్యాచ్..!
మొదటి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.