ENG vs IND : రిషబ్ పంత్ గాయంపై నితీశ్కుమార్ రెడ్డి అప్డేట్..
టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు.
- Thota Vamshi Kumar
- Published On : July 11, 2025 / 10:35 AM IST
Nitish Kumar Reddy Provides Crucial Injury Update On Rishabh Pant
ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్కు పెద్ద షాక్ తగిలింది. టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. అతడి ఎడమచేతి చూపుడు వేలికి తీవ్రగాయం కావడంతో రెండో సెషన్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. అయితే.. రిషబ్ పంత్
మళ్లీ తొలిరోజు మైదానంలో అడుగుపెట్టలేదు.
జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లోని ఓ బంతిని ఎడమవైపు దూకుతూ ఆపే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు. వెంటనే అతడికి మైదానంలోనే చికిత్స అందించారు. ఆ తరువాత అతడు కీపింగ్ కొనసాగించాడు. కానీ నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆ ఓవర్ ముగిసిన వెంటనే మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో సబ్స్టిట్యూట్గా ధ్రువ్ జురెల్ వచ్చాడు.
తొలి రోజు ఆట ముగిసిన తరువాత నితీశ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడికి పంత్ గాయానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ‘నాకు ఇప్పుడైతే పూర్తి వివరాలు తెలియవు. నేను ఇప్పుడే మైదానంలోంచి వచ్చాను. ఇంకా ఎవరిని దీని గురించి అడగలేదు. రేపు ఉదయం అతడి గాయం పై పూర్తి స్పష్టత వస్తుంది.’ అని నితీశ్ రెడ్డి అన్నాడు.
జురెల్ బ్యాటింగ్ చేయలేడు..
పంత్ గాయంతో దూరం అయితే అది జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సబ్స్టిట్యూట్గా ఆడుతున్న ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేయలేడు. పంత్ ప్రస్తుతం భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ సిరీస్లో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో 85.50 సగటుతో 342 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ అర్థసెంచరీ ఉంది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్ (99 బ్యాటింగ్; 191 బంతుల్లో 9 ఫోర్లు), బెన్స్టోక్స్ (39) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో నితీశ్కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీయగా, జడేజా, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.
