India vs Pakistan Match : అతడితో జాగ్రత్త.. బౌలర్లకు హెచ్చరికలు చేసిన పాక్ మాజీలు .. ఎందుకంటే?
పాక్ మాజీ దిగ్గజం రమీజ్ రజా మాత్రం భారత్ - పాక్ మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ జట్టు అని చెప్పారు. అయితే, పాకిస్థాన్ జట్టుకు కూడా విజయానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.
- Harishth Thanniru
- Published On : October 14, 2023 / 12:48 PM IST
India vs Pakistan
ODI World Cup 2023 India vs Pakistan Match : వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో దాయాది జట్లయిన భారత్, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అహ్మదాబాద్ లోని ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ హైవోల్టేజీ మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ వసీమ్ అక్రమ్, మిస్బా ఉల్ హక్ ఆ జట్టు బౌలర్లకు కీలక హెచ్చరికలు చేశారు. భారత్ జట్టులోని ఆ బ్యాటర్ తో మీరు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఇంతకీ ఎవరు ఆ భారత్ బ్యాటర్.. పాక్ మాజీలు ఏం చెప్పారో ఓసారి చూద్దాం.
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ అయినా ఇరు జట్లకు సమంగా విజయావకాశాలు ఉన్నాయి. అయితే, వరల్డ్ కప్ చరిత్రలో ఏడు సార్లు ఈ ఇరు జట్లు తలపడ్డాయి. అన్నింటిల్లోనూ భారత్ జట్టే విజయం సాధించింది. ఇవాళ జరిగే మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ ప్లేయర్స్ వసీమ్ అక్రమ్, మిస్బా ఉల్ హక్ ఆ జట్టు బౌలర్లకు కీలక సూచనలు చేశారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేటప్పుడు పాక్ బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు.. అలవోకగా పరుగులు చేస్తున్నాడు. ఎలాంటి రిస్క్ లేకుండానే అద్భుత షాట్లు కొటుడుతున్నాడు.. అద్భుత ఫామ్ లో ఉన్న రోహిత్ కు బౌలింగ్ చేసే సమయంలో పాక్ బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని వసీమ్ అక్రమ్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో డిబేట్ సమయంలో వ్యాఖ్యానించారు. కోహ్లీ కూడా బంతిపై పూర్తి నియంత్రణతో ఆడుతున్నాడు. అయితే, కోహ్లీ కంటే రోహిత్ విభిన్న తరహా బ్యాటర్. ఇతర బ్యాటర్ల కంటే బంతిని ఎదుర్కోవడానికి రోహిత్ వద్ద అదనపు సమయం ఉన్నట్లు అనిపిస్తుందంటూ వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు.
Read Also : Anushka Sharma : విరాట్ కోహ్లీకి మద్ధతుగా అహ్మదాబాద్ చేరుకున్న అనుష్కశర్మ
మిస్బా ఉల్ హక్ మాట్లాడుతూ.. ఆప్గాన్ మ్యాచ్ లో రోహిత్ ఆటతీరును చూస్తే ప్రత్యర్థి జట్ల బౌలర్లు ఒత్తిడికి గురికావటం సహజమే. రోహిత్ క్రీజులో ఉన్న సమయంలో బాల్ ఎక్కడ వేయాలనేదానిపై బౌలర్లు కసరత్తు చేయాలని అన్నారు. అయితే. పాక్ బౌలింగ్ ప్రస్తుతం బలంగా ఉంది. భారత్ జట్టు బ్యాటింగ్ లో బలోపేతమైన జట్టు. ఈ మ్యాచ్ లో బ్యాట్, బాల్ మధ్య రసవత్తర పోరు జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు. పాక్ మాజీ దిగ్గజం రమీజ్ రజా మాత్రం భారత్ – పాక్ మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ జట్టు అని చెప్పారు. అయితే, పాకిస్థాన్ జట్టుకు కూడా విజయానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.
