ODI World Cup 2023 : మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు.. పాక్ ఆటగాళ్లకు ఐదు నెలలుగా జీతాలు లేవు.. ఇలాగే ఆడుతారు మరీ..!
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన తీసి కట్టుగా ఉంది. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో మినహా పాకిస్థాన్ మరో మ్యాచ్లో విజయం సాధించలేదు.
- Thota Vamshi Kumar
- Published On : October 28, 2023 / 05:23 PM IST
Pakistan
Pakistan-ODI World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన తీసి కట్టుగా ఉంది. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో మినహా పాకిస్థాన్ మరో మ్యాచ్లో విజయం సాధించలేదు. ఇప్పటి వరకు మెగా టోర్నీలో పాక్ జట్టు 6 మ్యాచులు ఆడింది. రెండు మ్యాచుల్లో విజయం సాధించగా వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతు అయ్యాయి. సాంకేతికంగా మాత్రమే పాక్కు అవకాశాలు మిగిలి ఉన్నాయి.
పాకిస్థాన్ ఇలా వరుసగా మ్యాచులు ఓడిపోవడంతో కెప్టెన్ బాబర్ ఆజాం సహా మిగిలిన ఆటగాళ్లు అందరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంకా బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉందని అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఐదు నెలలుగా పాక్ ఆటగాళ్లకు జీతాలు అందడవం లేదన్నాడు. బోర్డు పెద్దలను సంప్రదించేందుకు కెప్టెన్ బాబర్ ఆజాం ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారు అతడిని పట్టించుకోవడం లేదన్నాడు.
Most Sixes: ఆస్ట్రేలియా సిక్సర్ల రికార్డు.. ఎన్ని సిక్సర్లు కొట్టిందో తెలుసా?
ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్కు గత రెండు రోజులుగా కెప్టెన్ బాబర్ ఆజాం మెసేజ్లు చేస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదు. పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్, డైరెక్టర్ ఉస్మాన్ వాల్హాలకు సంప్రదించేందుకు బాబర్ ప్రయత్నించగా వారు కూడా రిప్లైలు ఇవ్వలేదు. ఓ కెప్టెన్ తోనే వారు మాట్లాడకుంటే ఎలా అని లతీఫ్ ప్రశ్నించాడు. వారు ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటి..? ఆ విషయాలు తెలియడం లేదు. పీసీబీలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు.
ఇక.. ప్రపంచకప్ ముందు ఆటగాళ్లు సంతకం చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ల ఒప్పందాన్ని పునః పరిశీలిస్తామని పీసీబీ చెప్పింది. దీంతో గత ఐదు నెలలుగా పాక్ ఆటగాళ్లకు జీతాలు అందలేదు. అలాంటప్పుడు ఆటగాళ్ల నుంచి ఇంతకంటే మంచి ప్రదర్శనను ఎలా ఆశించగలం అని అంటూ లతీఫ్ రషీద్ పీసీబీ తీరును తప్పుబట్టాడు.
ODI World Cup 2023 : పాకిస్థాన్ సెమీస్ దారులు మూసుకుపోలేదా..? ఇంకా అవకాశం ఉందా..? ఎలాగో తెలుసా..?
