Pakistan Government Allows Team To Play India At T20 World Cup 2026
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్, పాక్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్పై అనిశ్చితి తొలగిపోయింది. ఈ మ్యాచ్ను బహిష్కరించాలన్న నిర్ణయం పై ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మిత్ర దేశాల విజ్ఞప్తిలు, చర్చల ద్వారా వచ్చిన ఫలితాలతో తాము సంతృప్తి చెందడంతోనే పాక్ జట్టు భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు సోమవారం అర్థరాత్రి ఓ ప్రకటనలో తెలిపింది.
ఆదివారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో ఐసీసీ సమావేశమైంది. అదే సమయంలో భారత్తో మ్యాచ్ ఆడాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పాక్ను కోరాయి. ఈ పరిణామాల తరువాత పాక్ ప్రభుత్వం బహిష్కరణ నిర్ణయంపై వెనక్కి తగ్గింది.
Wanindu Hasaranga : మలింగ, రషీద్ ఖాన్, అఫ్రిది రికార్డులను బ్రేక్ చేసిన వనిందు హసరంగా..
‘చర్చల ద్వారా వచ్చి ఫలితాలు, అలాగే మిత్ర దేశాల నుంచి అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 15న టీ20 ప్రపంచకప్ 2026లో షెడ్యూల్ చేయబడిన మ్యాచ్లో పాక్ జట్టు ఆడేందుకు అనుమతి ఇస్తున్నాం. క్రికెట్ స్ఫూర్తిని కాపాడటం, పాల్గొనే అన్ని దేశాలతో క్రీడ కొనసాగింపునకు మద్దతు ఇవ్వడం అనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని పాక్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
సోమవారం సాయంత్రం.. బీసీబీ చీఫ్ అమీనుల్ ఇస్లాం ఢాకాలో ఒక ప్రకటనను విడుదల చేశారు. తమ దేశానికి మద్దతు ఇచ్చినందుకు పాకిస్తాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ యొక్క గొప్ప ప్రయోజనం కోసం భారత్తో మ్యాచ్ ఆడాలని అభ్యర్థించారు.
‘బంగ్లాదేశ్కు మద్దతు ఇవ్వడంలో పాక్ చేస్తున్న కృషి మమ్మల్ని ఎంతో కదిలించింది. మన సోదరభావం దీర్ఘకాలం వర్ధిల్లాలి. నిన్న పాక్లో పర్యటన తరువాత, మా చర్చల ద్వారా రాబోయే ఫలితాలను దృష్టిలో ఉంచుకుని, మొత్తం క్రికెట్ పర్యావరణ వ్యవస్థ ప్రయోజనం కోసం ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్ ఆడాలని నేను పాక్ను అభ్యర్థిస్తున్నాను.’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం తెలిపాడు.
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్నాయకే కూడా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఫోన్ చేశారు. ప్రస్తుత ప్రతిష్టంభనను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి తీవ్రంగా పరిగణించాలని శ్రీలంక అధ్యక్షుడు పాక్ ప్రధాన మంత్రిని అభ్యర్థించారు అని పాకిస్తాన్ ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.
ఐసీసీ ఏం చెప్పిందంటే?
పీసీబీ, బీసీబీ లతో జరిగిన చర్యలు సఫలం అయ్యాయని ఐసీసీ తెలిపింది. టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ పాల్గొనకపోవడంపై నిరాశను వ్యక్తం చేసింది. ప్రస్తుత అంశానికి సంబంధించి (భారతదేశంలో ఆడటానికి నిరాకరించినప్పటికి) బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడాపరమైన, పరిపాలనా జరిమానా విధించబోమని హామీ ఇచ్చింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధన ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు బంగ్లా బోర్డుకి ఉందని స్పష్టం చేసింది. దీని వల్ల ఆ హక్కుకు ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని తెలిపింది. అంతేకాదండోయ్.. 2031 పరుషుల ప్రపంచకప్ జరగడానికి కన్నా ముందు ఓ ఐసీసీ ఈవెంట్కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది.