Paris Olympics 2024
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ప్రస్తానం ముగిసింది. ఒలింపిక్స్ లో ఇవాళ పోటీల చివరి రోజు అయినా.. భారత్ ఆట మాత్రం శనివారంతో ముగిసింది. రెజ్లర్ రీతిక గట్టిగానే పోరాడినా క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. ఈ ఒలింపిక్స్ లో భారత్ పోరాటం ఆరు పతకాలతో ముగిసింది. ఆరు పతకాల్లోనూ స్వర్ణం ఒక్కటికూడా లేదు. దీంతో స్వర్ణ పతకం లేకుండానే భారత్ అథ్లెట్స్ తిరుగుముఖం పట్టినట్లయింది. ఒక రజతం, ఐదు కాంస్యాలతో పాయింట్ల పట్టికలో భారత్ 70వ స్థానంలో నిలిచింది. అయితే, మహిళల 50 కేజీల విభాగంలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ రజత పతకం కోసం చేసుకున్న అప్పీల్ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఇవాళ వినేశ్ ఫోగట్ అప్పీల్ పై సీఏఎస్ (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ) తుది నిర్ణయం తీసుకోనుంది. వినేశ్ ఫోగట్ కు అనుకూలంగా ప్రకటన వస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది.
2020 టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత్ ఏడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. పారిస్ లో మాత్రం కేవలం ఆరు పతకాలకే పరిమితం అయింది. పతకాల పరంగా భారత్ లోని క్రీడాభిమానులకు నిరాశే అయినా.. భారత్ అథ్లెట్స్ ప్రదర్శన పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. అనుకున్న స్థాయిలో పతకాలు లేకపోయినా పలు విభాగాల్లో అథ్లెట్స్ మంచి ప్రదర్శనే ఇచ్చారు. కాస్త కలిసొస్తే భారత్ తన అత్యుత్తమ ఒలింపిక్ ప్రదర్శన చేసేదే. తృటిలో కొన్ని పతకాలు చేజారాయి.
భారత్ అథ్లెట్లు సాధించిన పతకాలు..
మను భాకర్ – కాంస్యం (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్)
మను భాకర్ – సర్బ్జ్యోత్ సింగ్ : కాంస్యం (మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం)
స్వప్నిల్ కుసలే – కాంస్యం (పరుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్)
హాకీ జట్టు : కాంస్యం (పురుషుల ఫీల్డ్ హాకీ జట్టు)
నీరజ్ చోప్రా : రజతం (పురుషుల జావెలిన్ త్రో)
అమన్ సెహ్రావత్ : కాంస్యం (పురుషుల 57కేజీల రెజ్లింగ్)