Ravichandran Ashwin : టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్లో శుభారంభం చేసింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పుడు ఎంత టెన్షన్ కలిగిందో విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చినప్పుడు అంతకంటే పదిహేను రెట్లు ఎక్కువగా టెన్షన్ పడ్డారు. ఆ సమయంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఆందోళన చెందాడట. ఈ విషయాన్ని స్వయంగా అశ్విన్ చెప్పాడు.
కోహ్లీ గాల్లోకి బంతి లేపగానే..
విరాట్ కోహ్లీ వికెట్ యొక్క ప్రాధాన్యం అభిమానులు, ప్రత్యర్థి ఆటగాళ్లకే కాదు అతడి సహచరులకు సైతం తెలుసు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నో సార్లు ఒంటి చేత్తో జట్టుకు విజయాలను అందించాడు కోహ్లీ. ఛేదనలో కోహ్లీ ఉన్నాడంటే చాలు అభిమానులు ప్రశాంతంగా ఉంటారు. అలాంటి కోహ్లీ ఆదివారం ఆసీస్తో మ్యాచ్లో బంతికి గాల్లోకి లేపిన క్షణంలో ఎక్కడ కోహ్లీ ఔట్ అవుతాడోనన్న భయంతో డ్రెస్సింగ్ రూమ్ను వేగంగా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చినట్లు అశ్విన్ చెప్పాడు.
Rohit Sharma : వన్డే ప్రపంచకప్లో కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన ఘనత
“డ్రెస్సింగ్లో రూమ్లో ఉండగా.. ఒక్కొ వికెట్ పడుతోంది. అయితే.. నన్ను ఎక్కువ ఆందోళనకు గురి చేసింది మాత్రం విరాట్ కోహ్లీనే. అతడు బంతికి గాల్లోకి లేపగానే.. నేను డ్రెస్సింగ్ రూమ్లోంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. మిచెల్ మార్ష్ క్యాచ్ వదిలివేయడంతో ఊపిరిపీల్చుకున్నాను. వెంటనే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయా. మ్యాచ్ ముగిసే వరకు ఒకే స్థానంలో నిలబడి ఉన్నా. దీంతో నా కాళ్లు నొప్పిగా ఉన్నాయ్ (నవ్వుతూ).” అంటూ అని అశ్విన్ చెప్పాడు.
కీలక ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లతో పాటు శ్రేయస్ అయ్యర్లు డకౌట్లు అయ్యారు. దీంతో భారత్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లు ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నారు.
ఈ సమయంలో మరో వికెట్ పడి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండి ఉండేదేమో. ఆసీస్ బౌలర్ల ధాటికి పరుగుల రాక కష్టమైన తరుణంలో విరాట్ కోహ్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాలని భావించాడు. ఈ క్రమంలో ఓ షాట్ ఆడాడు. అయితే.. బంతి అక్కడే గాల్లోకి లేచింది. ఈ సమయంలో భారత అభిమానుల గుండె ఆగినంత పనైంది. అయితే.. మిచెల్ మార్ష్ బంతిని సరిగ్గా అంచనాల వేయలేక మిస్ చేశాడు. అప్పుడు కోహ్లీ స్కోరు 12 పరుగులు మాత్రమే. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విరాట్ కోహ్లీ 85 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ (97నాటౌట్) తృటిలో శతకాన్ని కోల్పోయినప్పటికి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.