Ravindra Jadeja: తన భార్య రివాబాపై తన తండ్రి ఆరోపణలు చేసినా టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం ఆమెపై తన ప్రేమను చాటుకుంటూనే ఉన్నాడు. తన తండ్రి చేసిన ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా భార్యకు బాసటగా నిలుస్తున్నాడు. తాజాగా రాజ్కోట్ టెస్ట్లో తాను గెల్చుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన భార్యకు డెడికేట్ చేశాడు. ”ఈ అవార్డును నా భార్యకు అంకితం చేస్తున్నాను. నా కోసం ఆమె ఎంతో కష్టపడుతుంది. నా ఎదుగుదలలో ఆమె కృషి చాలా ఉంది. ఎల్లపుడు నాకు అండగా నిలుస్తుంద”ని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో జడేజా చెప్పాడు.
ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ(112)తో చెలరేగగా.. సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడం ఓ ప్రత్యేక అనుభూతి. అదే టెస్టులో సెంచరీ సాధించి, 5 వికెట్లు పడగొట్టడం ఇంకా స్పెషల్ అని జడేజా వ్యాఖ్యానించాడు. హోమ్ గ్రౌండ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, దీన్ని తన భార్యకు అంకితం చేస్తున్నట్టు వెల్లడించాడు.
కాగా, రివాబాపై తన తండ్రి చేసిన వ్యాఖ్యలను జడేజా అంతకుముందు ఖండించాడు. తన తండ్రి ఆరోపణల్లో అర్ధంలేనివని, అసత్యమని కొట్టిపారేశాడు. నా భార్య ప్రతిష్టను దిగజార్చేలా, ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబం తాను కూడా చెప్పాల్సింది చాలా ఉందని, ఆ విషయాలను బహిరంగంగా చెప్పనని అన్నాడు. తమ కుటుంబంలో చీలికలు రావడానికి కోడలు రివాబా కారణం అని టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. రివాబా తన కొడుకు జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తమ మధ్య ఉన్న బంధం తెగిపోయిందని ఆయన వెల్లడించారు.