Rishabh Pant shares photo of his fractured foot
Rishabh Pant : టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఇంగ్లాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో గాయపడిన సంగతి తెలిసిందే. నాలుగో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి అతడి కుడి పాదాన్ని బలంగా తాకింది. దెబ్బకు పంత్ నొప్పితో విలవిలలాడిపోయాడు. అతడి పాదం వాయడంతో పాటు రక్తం కారుతూ ఉండడం టీవీల్లోనూ కనిపించింది. కనీసం నడవలేని స్థితిలో ఉన్న అతడిని గోల్ఫ్ కార్ట్ లో గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువెళ్లారు.
పంత్ కు శస్త్రచికిత్స అవసరం లేదని, ఓ ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు వెల్లడించారు. కాగా.. పంత్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. ‘ఐ హేట్ దిస్ సో మచ్’ అంటూ గాయమైన పాదం ఫోటోను పంత్ షేర్ చేశాడు. దీన్ని చూసిన అభిమానులు.. అతడు త్వరగా కోలుకుని మైదానంలో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.
Get well soon, Rishabh Pant! 🙏❤️ pic.twitter.com/NEZuuB5Rai
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2025
చెఫ్గా పంత్..
ఇదిలా ఉంటే.. పంత్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో పంత్ చెఫ్ అవతారంలో కనిపించాడు. ‘పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తాను.. కాస్త నన్ను భరించండి.. వెజిటేరియన్ పిజ్జా చేయబోతున్నా. ఇక్కడ చాలా వేడిగా ఉంది. విరిగిన కాలుతో ఇప్పుడు నేను చేయగలిగేది పిజ్జాలు కాల్చడమే. నేనెప్పుడూ ఇంట్లో ఏమీ వండలేదు.’ అని పంత్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్కు డౌటే?
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత జట్టును ఆగస్టు మూడో వారంలో ఎంపిక చేయనున్నారు. అయితే.. ఈ మెగాటోర్నీలో పంత్ ఆడడం డౌటేనని వార్తలు వస్తున్నాయి. గాయం నుంచి పంత్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. టోర్నీ ప్రారంభం అయ్యే సమయానికి అతడు కోలుకున్నా కూడా ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే అతడు ఈ టోర్నీ ఆడడని అంటున్నారు.