Riyan Parag Fine : ఇ-సిగ‌రేట్ వివాదం.. రియాన్ ప‌రాగ్‌కు బీసీసీఐ భారీ జ‌రిమానా..

Riyan Parag Fine 25 Percent: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌కు (Riyan Parag) బీసీసీఐ భారీ జ‌రిమానా విధించింది.

Riyan Parag has been fined 25 per cent of his match fee for dressing room vaping

  • డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ ప‌రాగ్ వేపింగ్‌
  • స్పందించిన బీసీసీఐ
  • భారీ జ‌రిమానా
  • మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత‌, ఓ డీమెరిట్ పాయింట్ జ‌త‌

Riyan Parag : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌కు బీసీసీఐ భారీ జ‌రిమానా విధించింది. అత‌డి మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్‌గా వేసింది. అంతేకాదండోయ్ అత‌డి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. ఆట పరువుకు భంగం క‌లిగించిన‌ట్లుగా భావించ‌డంతో బీసీసీఐ ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంది.

‘ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 40వ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు, జట్టు అధికారుల కోసం రూపొందించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1ను ఉల్లంఘించినందుకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు అతని మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించారు. “ఆటకు అపఖ్యాతి తెచ్చే ప్రవర్తన”కు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21ను రియాన్ ఉల్లంఘించినట్లు తేలింది.

*బుమ్రా వ‌ల్లే స‌న్‌రైజ‌ర్స్ పై ముంబై ఓడిపోయిందా.. బ్యాటింగ్ కోచ్ కీర‌న్ పొలార్డ్ కామెంట్స్ వైర‌ల్‌..

రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ వేప్ (ఇ-సిగ‌రేట్‌)ఉపయోగిస్తూ కనిపించడంతో ఈ సంఘటన జరిగింది. రియాన్ తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ విధించిన శిక్షను స్వీకరించాడు. ఐపీఎల్ ప్రతిష్ట చెక్కుచెదరకుండా ఉండేలా చూసేందుకు, తప్పు చేసిన జట్టు, దాని అధికారులు, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తోంది.’ అని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అస‌లేం జ‌రిగిందంటే?

మంగ‌ళ‌వారం (ఏప్రిల్ 28న‌) న్యూ చండీగ‌ఢ్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ వేపింగ్ (ఇ-సిగ‌రేట్‌) చేస్తూ క‌నిపించాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు మొత్తం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల్లో క‌నిపించాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అంద‌రి నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఈక్ర‌మంలోనే బీసీసీఐ చ‌ర్య‌లు తీసుకుంది. మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చింది.

*ముంబై ఇండియ‌న్స్‌ది మామూలు అదృష్టం కాద‌య్యా.. స‌న్‌రైజ‌ర్స్ పై ఓట‌మి.. అయినా గానీ ప్లేఆఫ్స్‌కు వెళ్లొచ్చు..

ఇదిలా ఉంటే.. వాస్త‌వానికి 2019లోనే మ‌న‌దేశంలో (భార‌త్‌)లో ఇ-సిగ‌రేట పై నిషేదం విధించారు. 2019 ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం ఎవ‌రైనా ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డితే జైలు శిక్ష‌తో పాటు భారీ జ‌రిమానా ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. ఇప్పుడు ప‌రాగ్ వేపింగ్ చేయ‌డంతో అత‌డికి ఎలాంటి శిక్ష ప‌డుతుంద‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది.